తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిఆర్ఎస్ పార్టీ నిశబ్ధంగా పావులు కదుపుతోంది. అందుకు కేంద్ర ప్రభుత్వం తనకు తోడ్పడుతుందని ఆశపడుతున్నారు.
ఈ విషయం సిఎం రేవంత్ రెడ్డికి కూడా బాగా తెలుసు. అందుకే ఆయన కూడా జాగ్రత్తపడుతూ 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాగేసుకొని శాసనసభలో తన పార్టీ బలం పెంచుకున్నారు. కానీ బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ చేతులు కలిపితే ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న మజ్లీస్ పార్టీని కూడా మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
శనివారం శాసనసభ సమావేశంలో హైదరాబాద్ మెట్రోపై చర్చ జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి, మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుదీన్ ఓవైసీని ఉద్దేశ్యించి, “మీరు మీ దోస్త్ (కేసీఆర్)కి పదేళ్ళు సమయం ఇచ్చారు. కానీ ఆయన పాతబస్తీకి మెట్రో వేయకుండా కాలక్షేపం చేసి వెళ్ళిపోయారు.
ఇప్పుడు మీరు మీ ఈ కొత్త దోస్త్ (రేవంత్ రెడ్డి)కి కేవలం 5 ఏళ్ళు సమయం ఇస్తే చాలు. పాతబస్తీకి మెట్రో వేయడమే కాదు… వచ్చే ఎన్నికలలో ఇద్దరం కలిసి మెట్రోలోనే పాతబస్తీకి వెళ్ళి ఓట్లు అడుగుదాము,” అని అన్నారు.
రేవంత్ రెడ్డి అంతటితో ముగిస్తే అదేమీ పెద్ద విశేషం కాదు కానీ “ఒకవేళ వచ్చే ఎన్నికలలోగా పాతబస్తీకి మెట్రో వేయలేకపోతే, అక్బరుదీన్ ఓవైసీకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపించుకుంటాము. ఆ తర్వాత అక్బరుదీన్ ఓవైసీని తెలంగాణ ఉప ముఖ్యమంత్రిని చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను,” అని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే ఆలోచింపజేస్తాయి.
ఈ కొత్త దోస్త్ రేవంత్ రెడ్డికి 5 ఏళ్ళు సమయం ఇవ్వాలని కోరారు. అంటే 5 ఏళ్ళు అధికారంలో కొనసాగేందుకు మద్దతు ఇమ్మనమనా లేక పాతబస్తీకి మెట్రో తేవడానికా? అంటే అవసరమైతే మద్దతు ఇమ్మనమని కోరుతున్నట్లే భావించవచ్చు.
మజ్లీస్ పార్టీ చిరకాల వాంఛ డెప్యూటీ సిఎం పదవి. దానిని ఇస్తామని రేవంత్ రెడ్డి చెపుతున్నారు. పాతబస్తీకి మెట్రో, ఓవైసీని కాంగ్రెస్లో చేర్చుకోవడం, కొడంగల్ నుంచి పోటీ చేయించడం వంటివన్నీ ఉప కధలే అని భావించవచ్చు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేసీఆర్ పడగొట్టేందుకు ప్రయత్నిస్తే, మజ్లీస్ పార్టీ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరి మద్దతు ఇవ్వడం, అందుకు ప్రతిగా అక్బరుదీన్ ఓవైసీకి డెప్యూటీ సిఎం పదవి ఇవ్వడమే అసలు కధ.




