అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తే అమెరికా సుప్రీంకోర్టు వాటికి అడ్డుకట్ట వేయడంతో ప్రపంచ దేశాల నుంచి ముక్కు పిండి వసూలు చేసిన సొమ్ము వాపసు చేయాల్సివస్తోంది. తిరుగులేని అధికారాలు కలిగిన ఆయనకు, అమెరికా వంటి అగ్రదేశానికి ఇది తీరని అవమానమే.. అప్రదిష్టే.
అదేవిధంగా ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టినందుకు ఇప్పుడు ట్రంప్ అనుక్షణం ప్రాణభయంతో జీవిస్తున్నారు. ఇటీవల చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ తనకేదైనా జరిగితే అంటూ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేరిట ఓ రహస్యలేఖని వైట్హౌస్లో ఉంచి వెళ్ళడం ఒక ఉదాహరణ.
తాజాగా ఈ వారాంతంలో ట్రంప్ పెద్ద కొడుకు ట్రంప్ జూనియర్ పెళ్ళి బహామాస్లో జరుగబోతోంది. దానికి హాజరయితే తన ప్రాణానికి హానీ ఉంటుందని ట్రంప్ భయపడుతున్నారు. కనుక మొదటి కొడుకు రెండో పెళ్ళికి తాను హాజరు కాకపోవచ్చునని ట్రంప్ చెప్పారు.
ఇరాక్తో ఏకధాటిగా 8 ఏళ్ళపాటు యుద్ధం చేసిన అనుభవం కలిగిన ఇరాన్ శక్తి సామర్ధ్యాలను ట్రంప్ తక్కువగా అంచనా వేశారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని యుద్ధం మొదలుపెట్టడం, తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని కుటుంబ సమేతంగా మట్టుబెట్టడం, ఇరాన్ని తుడిచిపెట్టేస్తానని బెదిరిస్తుండటం వంటివన్నీ ఇరానీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేవే. వారిలో ప్రతీకారేచ్చ రగిలించేవే.
కనుక ఈ యుద్ధం ముగిసినా ఇక ట్రంప్ జీవించి ఉన్నంత కాలం ప్రాణ భయంతో దినదినగండంలా జీవించాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన ట్రంప్, కొడుకు పెళ్ళికి హాజరయ్యేందుకు భయపడుతున్నారంటే ఆయన ఎంత ప్రమాదంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇది ఆయన స్వయంకృతమే. కనుక ప్రాణభయంతో జీవించక తప్పదు. కానీ అయన దుందుడుకు నిర్ణయాల వలన అమెరికా దేశానికి, ప్రజలకు కూడా ఇలాంటి కొత్త సమస్యలు సృష్టించారని చెప్పక తప్పదు.




