భారతీయుల దేశభక్తి ఒకలా ఉంటుంది. అమెరికన్ల దేశభక్తి మరోలా ఉంటుంది. ఇప్పుడా దేశభక్తికి కూడా నిర్వచనాలు మారిపోతున్నాయి. భారత్లో దేశభక్తి గురించి చర్చ ఇప్పుడు అప్రస్తుతం. అమెరికాలో దేశభక్తి ఎలా ఉండాలో ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వివరించారు.
వాషింగ్టన్లో జరిగిన ‘ఏఐ సమ్మిట్’లో ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతూ టెక్ కంపెనీలు అమెరికాలో ఉన్న స్వేచ్చని దుర్వినియోగం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కొన్ని పెద్ద అమెరికన్ టెక్ కంపెనీలు ‘గ్లోబల్ మార్కెట్’ పేరుతో ఇండియా, చైనా వంటి దేశాలలో కంపెనీలు ఏర్పాటు చేసుకుంటూ అమెరికాని నిర్లక్ష్యం చేస్తున్నాయని ట్రంప్ అన్నారు.
అమెరికాలో ఉన్న కంపెనీలలో కూడా అమెరికన్ల కంటే భారతీయ టెకీలను నియమించుకోవదానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. తద్వారా అమెరికన్లకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయన్నారు. కనుక టెక్ కంపెనీలన్నీ కాస్త మైండ్ సెట్ మార్చుకోవలసిన సమయం వచ్చిందన్నారు. టెక్ కంపెనీలు సైతం కాస్త దేశభక్తి చూపిస్తూ అమెరికాకు, అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకోవాలని ట్రంప్ హితవు పలికారు.
కాదని విదేశాలలో కంపెనీలు ఏర్పాటు చేసుకొని అక్కడివారినే ఉద్యోగులుగా నియమించుకుంటూ, ఐర్లాండ్లో లాభాలు దాచుకొంటూ, అమెరికాలో పన్ను రాయితీలు పొందాలనుకుంటే ఆ రోజులు పోయాయని ఇకపై కుదరదని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
కనుక టెక్ కంపెనీలన్నీ తమ విధానాలను అమెరికాకు, అమెరికన్లను ఉద్యోగాలు కల్పించేలా మార్చుకోవాలని, లేకుంటే తగు చర్యలు తీసుకోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
ఆంక్షల విధింపు విషయంలో ఇప్పటి వరకు ప్రతీ హెచ్చరికని అమలు చేసి చూపారు. కనుక ట్రంప్ ఏదో యధాలాపంగా మాట్లాడారని ఈ హెచ్చరికని టెక్ కంపెనీలు కొట్టిపడేయలేవు. కనుక అమెరికన్ కంపెనీలను భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షించడం మరింత కష్టం కావచ్చు.
ట్రంప్ హెచ్చరికల నేపధ్యంలో భారతీయ టెకీల స్థానంలో అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. కనుక అమెరికాలో ఉద్యోగావకాశాలు తగ్గవచ్చు. అలాగే భారత్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు అమెరికాలో వ్యాపార లావాదేవీలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విదిస్తే, ఆ ప్రభావం వాటి ఉద్యోగులపై పడే అవకాశం ఉంటుంది.
ఎన్నికల ప్రచార సమయంలోనే ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ అని నినాదంతో సగటు అమెరికన్లని ఆకర్షించగలిగారు. నేటికీ అదే విధానంతో ముందుకు సాగుతున్నట్లు తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
అమెరికా ప్రయోజనాలు, దేశభక్తి కోణంలో చూస్తే ఆయన సలహా సహేతుకంగానే అనిపిస్తుంది. అమెరికన్ల కంటే చాలా తక్కువ జీతాలతో పనిచేసే భారతీయులనే భరించలేకపోతున్నామంటూ తరచూ వేలమంది ఉద్యోగులను తొలగిస్తున్నప్పుడు, అంతకు రెట్టింపు లేదా మూడు రెట్ల జీతాలతో అమెరికన్లను నియమించుకొని భరించగలవా?
కనుక లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్న కంపెనీలు దేశభక్తి కోణంలో వ్యాపారాలు చేసుకోవాలంటే కష్టమే. కానీ చేయక తప్పదు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనేమో?






