ఏపీ శాసనసభ ఎన్నికల ప్రచార సమయంలో ఎవరో గులాకరాయితో జగన్మోహన్ రెడ్డిని హత్య చేయబోతే ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత నుదుటన బ్యాండెయిడ్ వేసుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నించారు.
కానీ 175కి 175 సీట్లు మనవే అని ప్రగల్భాలు పలుకుతూ మళ్ళీ ఈ సానుభూతి ఓట్ల కోసం కక్కుర్తి ఏమిటో? అంటూ గిట్టనివారు ఒకటే నస పెడుతుండటంతో జగన్ బ్యాండెయిడ్ తీసేసి ఆ డ్రామా ముగించక తప్పలేదు. అదే… పోలింగ్ రోజు వరకు బ్యాండెయిడ్ వేసుకుని ఉండి ఉంటే 175 సీట్లు గెలుచుకుని ఉండేవారేమో?అని శ్రేయోభిలాషులు అనుకుంటున్నారు.
మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంలో అప్పుల పాలైన రాష్ట్రం. కనుక జగన్ గులాకరాయితో సరిపెట్టుకున్నారు. కానీ అమెరికా అన్ని విధాల అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం. కనుక అక్కడ ఎవరినైనా చంపాలనుకుంటే గులాకరాళ్ళను వాడరు. తుపాకీలతోనే ప్రయత్నిస్తారు.
కనుక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్పై ఇటీవల ఎవరో తుపాకీతో కాల్పులు జరిపాడు. కానీ ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆయన చెవికి చిన్న గాయం అవడంతో వైద్యులు చిన్న బ్యాండెయిడ్ వేశారు.
అది ఆయన కోరుకున్నది కానప్పటికీ ఎన్నికలలో కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండటంతో ట్రంప్ తన ప్యాలస్లో కూర్చోలేరు కనుక చెవికి బ్యాండెయిడ్తో మళ్ళీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
అసలే ట్రంప్ మామూలోడు కాదు. ఇప్పుడు ఈ కాల్పులు ఘటన, చెవికి బ్యాండెయిడ్ని చాలా చక్కగా ఎన్నికల ప్రచారంలో వాడేసుకుంటూ సానుభూతి ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం చేయకుండా ఉండరు.
ఏపీ ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీల బలమైన కూటమిని జగన్ ఢీకొనవలసి వచ్చింది. కనుక గులకరాయితో జగన్కు దెబ్బ తగిలిందే తప్ప సానుభూతి ఓట్లు రాలలేదు.
కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ ఎన్నికలలో మళ్ళీ పోటీ చేస్తున్న అధ్యక్షుడు జో బైడెన్ వృద్ధాప్యం వలన ఎన్నికల ప్రచారంలో తడబడుతున్నారు. జోబైడెన్ విధానాలు బాగానే ఉన్నా, ఆయన వృద్ధాప్యం మైనస్ పాయింట్గా మారింది.
కనుక ఈసారి అమెరికన్స్ మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు దీంతో సానుభూతి ఓట్లు కూడా సంపాదించుకోగలితే ఇక ఆయనకు తిరుగు ఉండకపోవచ్చు. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి.




