నిన్న విడుదలైన “దృశ్యం 3” ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో అలరించలేక మలయాళ మార్కెట్ లో పర్వాలేదనిపించుకొని.. మిగతా చోట్ల మాత్రం కష్టపడి నెట్టుకొస్తోంది. అయితే.. సినిమా చూసిన కొందరు అవుటాఫ్ కేరళ ఆడియన్స్ మాత్రం సినిమాలో వేసిన కొన్ని సెటైర్ల విషయంలో నొచ్చుకున్నారు.
విషయం ఏంటంటే.. “దృశ్యం 3” సినిమాలో మోహన్ లాల్ ప్లే చేసిన జార్జ్ అనే పాత్ర నిర్మాతగా మారి “దృశ్యం” అనే సినిమాని నిర్మిస్తుంది. ఆ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. వేరే భాషల్లో డబ్బింగ్ లేదా రీమేక్ రైట్స్ కోసం చాలామంది డిస్ట్రిబ్యూటర్లు & ప్రొడ్యూసర్లు వెంటపడుతున్నట్లుగా చూపిస్తారు. ఆ సందర్భంలో మోహన్ లాల్ పాత్రతో “రెండు వారాలు దాటనియ్యి.. అప్పుడు మనమే నిర్మాతలను డిమాండ్ చేయొచ్చు.. వాళ్లే రీమేక్ రైట్స్ కోసం వెంట పడతారు” అనే డైలాగ్ ఉంటుంది. అలాగే.. డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా ఒక గట్టి సెటైర్ ఉంటుంది. ఇదంతా సరిపోదన్నట్లు.. సినిమా స్టేట్ దాటితే పైరసీ అయిపోతుంది అంటాడు, అలాగే పైరసీ ప్రింట్ యూట్యూబ్ లో వచ్చినట్లు చూపిస్తాడు.
రీమేక్ రైట్స్ డైలాగ్ తో వెంకటేష్, కమల్ హాసన్, అజయ్ దేవగన్ లాంటి నటుల్ని ఎద్దేవా చేసినట్లుగా ఉందని, ఇక పైరసీ అనేది కేరళలో అవ్వదు, మిగతా రాష్ట్రాలలోనే అవుతుందని అనేది మరీ కామెడీ అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. జీతూ జోసెఫ్ & మోహన్ లాల్ లు ఇలా పరభాషా నటులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరియు ఇండస్ట్రీ మీద పంచులు వేయాల్సిన అవసరం ఏముంది? 2024లో మంచి సక్సెస్ రేషియో ఉన్న మలయాళం ఇండస్ట్రీ 2025 & 2026లో ఇప్పటివరకు ఒక నిజమైన బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోలేకపోయిన విషయం మర్చిపోతే ఎలా?




