వైసీపీ నుంచి బహిష్కరించబడినా ఆ పార్టీ నేతలతోనే తిరుగుతున్నవారిలో ఇద్దరు ఎమ్మెల్సీలున్నారు. ఒకరు అనంతబాబు. మరొకరు దువ్వాడ శ్రీనివాస్. అనంతబాబుది ఫ్యాక్షన్ జోనర్ సినిమా అనుకుంటే దువ్వాడది రొమాంటిక్ జోనర్. కనుక ఇద్దరిలో దువ్వాడే బెటర్ అనుకోవాలేమో?
నేడు మహాశివరాత్రి సందర్భంగా దువ్వాడ కపుల్ అంటే శ్రీనివాస్-మాధురీ శ్రీశైలంలో ప్రత్యక్షమయ్యారు. వారికి నిజంగా ఎంత భక్తి ఉందో తెలీదు కానీ పండగలకి పబ్బాలని బట్టి ఆయా పుణ్యక్షేత్రాలలో వాలిపోతుంటారు. అప్పుడు దేవుడి కంటే వారిద్దరే బాగా హైలైట్ అవుతుంటారు. రెడీగా ఉన్న మీడియా ప్రతినిధులు చకచకా నాలుగు ఫోటోలు, కుదిరితే రెండు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. అది వారి అదృష్టం. వారి అదృష్టాన్ని చూసి జగన్ అసూయపడుతుంటారు కూడా.
అందుకే ఇటీవల శాసనసభ హాజరు కోసం జగన్ వచ్చినప్పుడు దువ్వాడ వెళ్ళి పలకరిస్తే “ఓవర్ యాక్షన్ చేస్తున్నావేమిటి? సినిమా హీరోననుకున్నావా?” అని చివాట్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ దువ్వాడ ప్రేమ పక్షులు మళ్ళీ శ్రీశైలంలో వాలిపోయి సందడి చేశాయి.




