తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడినందున దాని స్థానంలోకి బీజేపి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతుందని అందరూ అనుకుంటే, కల్వకుంట్ల కవిత తమ బీఆర్ఎస్ పార్టీయే బీజేపిలో చేరిపోతుందంటూ బాంబు పేల్చారు.
ఆ విదంగా జరిగినా తెలంగాణలో రాజకీయ యుద్ధం కాంగ్రెస్-బీజేపిల మద్యకు మారుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో నుంచి బీజేపిలోకి వచ్చిపడిన ఎంపీ ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపిలో ఉండలేకపోతున్నారు. కేంద్ర మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పెడుతున్న పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
శనివారమే అయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి బండి సంజయ్పై నిప్పులు చెరిగారు. బిజేపీ అధిష్టానం అయనని కట్టడి చేయకపోతే పార్టీ వీడాలనే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. అలాగని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరలేరు. చేరితే కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. ఇదీగాక ఒకవేళ అది బీజేపిలో విలీనం అయితే మళ్ళీ బిజేపీలోకి వచ్చిపడతారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హౌస్ ఫుల్ అయ్యింది కనుక దానిలోకి వెళ్ళలేరు.
తెలంగాణ టీడీపి అధ్యక్షుడు పోస్టు ఇంకా ఖాళీగానే ఉంది. కానీ టీడీపి, బీజేపితో పొత్తులో ఉంది కనుక టీడీపీలో చేరలేరు. కనుక ఒకవేళ బీజేపిని వీడాల్సివస్తే సొంత కుంపటి పెట్టుకోవాలని ఈటల రాజేందర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కానీ తెలంగాణలో మరో పార్టీకి అవకాశం ఉందా?అంటే లేదనే అనిపిస్తుంది. అందుకే కల్వకుంట్ల కవిత తండ్రిపై తిరుగుబాటు చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెట్టుకుందామనుకొని ఆ ఆలోచన విరమించుకున్నారు.
ప్రస్తుతం ఆమె రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారింది కనుక ఒకవేళ వారిద్దరికీ పొసిగితే కొత్త పార్టీ పెట్టుకొని కలిసి పని చేయవచ్చు.




