జగన్ ప్రభుత్వం అప్పులు చేసి తెస్తున్న లక్షల కోట్లు ఎక్కడికిపోతున్నాయో తెలీదు చివరికి ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులు కూడా చెల్లించడం లేదు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ, దాచేపల్లి, మాచవరం మండలలోనే రెవెన్యూ డివిజన్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వగైరాలకు కలిపి మొత్తం రూ.66 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇవికాక వీధి దీపాలు, మంచినీటి పధకాలకు కోట్లు రూపాయిల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఏడీఏ సియానాయక్ తెలిపారు. ఆయా కార్యాలయాల అధిపతులకు, సంబందిత శాఖల అధికారులకు, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు గుర్తుచేస్తున్నా విధ్యుత్ బిల్లులు చెల్లించలేదని కనుక ఆయా కార్యాలయాలకు ఫ్యూజులు తీసేసి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు తమ ప్రభుత్వం వివిద పధకాలు, పనులకు సంబందించి గత ప్రభుత్వం చెల్లించకుండా ఎగవేసిన బకాయిలన్నిటినీ చెల్లిస్తోందని గొప్పగా చెప్పుకోవడం అందరూ వినే ఉంటారు. కానీ తమ హయంలో వాడుకొంటున్న విద్యుత్ ఛార్జీలే చెల్లించడం లేదని దీంతో స్పష్టమవుతోంది. తాము వాడుకొన్న విద్యుత్కే బిల్లులు చెల్లించని జగన్ ప్రభుత్వం, గత ప్రభుత్వం బకాయిలను చెల్లించిందంటే నమ్మశఖ్యంగా ఉందా?
అదేవిదంగా గతంలో తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు ఛార్జీలు తెలంగాణ ప్రభుత్వం చెల్లించడంలేదని, వాటిని చెల్లించమని ఆదేశించాలని సిఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ భీమవరం వచ్చినప్పుడు విజ్ఞప్తి చేశారు. కానీ తన ప్రభుత్వం వాడుకొంటున్న బిల్లులు చెల్లించకుండా ఎగవేస్తూ పొరుగు రాష్ట్రం నిజాయితీగా బిల్లులు చెల్లించాలని కోరుతుండటం విడ్డూరంగానే ఉంది కదా?
ఏడీఏ సియా నాయక్ అధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది బుదవారం ఈ దిగువన పేర్కొన్న కార్యాలయాలకు వెళ్ళి ఫ్యూజులు తీసేసి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.బకాయిలు చెల్లించిన తరువాతే విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని తెలిపారు.
| విద్యుత్ సరఫరా నిలిపివేసిన కార్యాలయం పేరు | చెల్లించవలసిన బకాయిలు | |
| 1 | రెవెన్యూ డివిజన్ కార్యాలయం (గురజాల మండలం) | రూ.7.50 లక్షలు |
| 2 | తహసీల్ధార్ కార్యాలయం | రూ.15 లక్షలు |
| 3 | ఎంఈవో కార్యాలయం | రూ.1.11 లక్షలు |
| 4 | గురజాల బంగ్లా | రూ.1.42 లక్షలు |
| 5 | పంచాయతీరాజ్ కార్యాలయం | రూ.78,000 |
| 6 | ఆర్ అండ్ బీ బంగ్లా | రూ.10,000 |
| 7 | ప్రాదమిక ఆరోగ్య కేంద్రం (మాచవరం) | రూ.5.0 లక్షలు |
| 8 | పోలీస్ స్టేషన్ | రూ.1.50 లక్షలు |
| 9 | తహసీల్ధార్ కార్యాలయం | రూ.7.91 లక్షలు |
| 10 | ఎంఈవో కార్యాలయం | రూ.80,000 |
| 11 | మాచవరం, పిన్నెల్లి మంచినీటి పధకాలు | రూ.1.50 లక్షలు |
| 12 | మాచవరం, పిన్నెల్లి, గంగిరెడ్డి పాలెం, మల్లవోలు, పిల్లుట్లలో సచివాలయాలు | రూ.1.20 లక్షలు |
| 13 | తహసీల్దార్ కార్యాలయం (దాచేపల్లి) | రూ.9.10 లక్షలు |
| 14 | మండల పరిషత్ కార్యాలయం | రూ.1.61 లక్షలు |
| 15 | ఆర్ అండ్ బీ బంగ్లా | రూ.2.75 లక్షలు |
| 16 | నడికుడి రైతు భరోసా కేంద్రం | రూ.1.16 లక్షలు |
| 17 | ఏపీ మోడల్ స్కూల్ | రూ.1.85 లక్షలు |
| 18 | ప్రభుత్వ పాఠశాలలు | రూ.2.00 లక్షలు |
| 19 | పిడుగురాళ్ల మండలంలో మైనింగ్ చెక్ పోస్టులకు, ఈసీడీఎస్, టీటీడీ కళ్యాణమండపం | రూ.3.71 లక్షలు |
| మొత్తం | రూ. 66,00,000 | |



