వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ బాట పట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసారు. అన్ని శాఖల్లోనూ అవినీతి పేరుకు పోయిందని చెప్పిన జగన్, దాదాపు లక్షా 30 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు అవినీతి చేసారని ఆరోపించారు. గతంలో జగన్ పై తెలుగుదేశం వర్గీయులు లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేసారని ఆరోపణలు చేయడంతో జగన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత దక్కినట్లయ్యింది. అయితే ఇదే విషయమై ఓ విలేఖరి జగన్ ను ప్రశ్నించినపుడు… సదరు మీడియా ప్రతినిధిపై అసహనం వ్యక్తం చేసిన జగన్… ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా, మీకు కనపడడం లేదా… కావాలంటే మీరు ఎంక్వయిరీ చేయండి దొర గారూ… ఎటకారంతో కూడిన అసహనం వ్యక్తం చేసారు.
అయితే ఈ సందర్భంగా… ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పేరుతో చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ ఒక పుస్తకం విడుదల చేసారు జగన్. సదరు పుస్తకాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అందజేసారు. ఈ పుస్తకంలో కంటెంట్ ఎలా ఉన్నా ‘టైటిల్’ మాత్రం అదిరిపోయే టాక్ ను సొంతం చేసుకుంది. ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ వంటి పవర్ ఫుల్ టైటిల్ ను సొంతం చేసుకునే ఘనత ఎవరికి ఉంది..? అనుభవం గడించిన చంద్రబాబుకా? ఇప్పటికే కేసులను ఎదుర్కొంటున్న యువనేత జగన్ మోహన్ రెడ్డికా..? రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ అనే టైటిల్ ఎవరిదీ అన్న చర్చ జరుగుతోంది.
దాదాపు 35 ఏళ్ళ పాటు విశేష రాజకీయ అనుభవం గడించిన చంద్రబాబుపై వైయస్ హయంలో అనేక కేసులు నమోదయ్యాయి. అయితే అవేమి కూడా విచారణ వరకు రాకపోగా, ప్రాధమిక దశలోనే వీగిపోయాయి. అలాగే ప్రస్తుతం జగన్ చేస్తున్న అవినీతి ఆరోపణలలో ‘క్రెడిబులిటీ’ ఎంతన్నది ప్రశ్నార్ధకమే! జగన్ పార్టీ మరియు పత్రిక ప్రచురించే కధనాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉంటాయని చాలా సందర్భాలలో నిరూపణ కావడంతో రాజకీయ లబ్ది కోసమే ఇలాంటి ఆరోపణలు పనికి వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ అనే టైటిల్ పొందాలంటే చంద్రబాబుకు దాదాపుగా అసాధ్యమైన విషయంగానే పరిగణించవచ్చు. ఒకవేళ చంద్రబాబుకు ఈ టైటిల్ సొంతం కావాలంటే ప్రస్తుతం జగన్ చేస్తున్న లక్షా 30 వేల కోట్ల అవినీతి ఆరోపణలు రుజువు చేసినట్లయితే కొంతమేరకు అవకాశం దక్కవచ్చు.
బరిలో ఉన్న మరొక అభ్యర్ధి కేవలం 7 సంవత్సరాల అనుభవ రాహిత్యంతో కూడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘క్విడ్ అండ్ ప్రో’ క్రింద అక్రమమైన మార్గంలో సంపాదన కూడగట్టారని కేసులు నమోదై సీబీఐ, ఈడీల విచారణలు కూడా జరిగాయి. అయితే, ఇప్పటికే 16 మాసాలు జైలు శిక్ష అనుభవించి, దాదాపుగా కొన్ని వందల కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసి, ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ అనే టైటిల్ కు అందరి కంటే ముందు వరుసలో ఉన్నారు జగన్. ఒకవేళ ఈ టైటిల్ నుండి జగన్ తప్పించుకోవాలంటే మాత్రం… ‘వైసీపీ వర్గాలు చెప్తున్నట్లు కడిగిన ముత్యం మాదిరి కేసుల నుండి బయటపడాలి.’ అయినప్పటికీ ఇప్పటికే కొన్ని వందల కోట్లు అక్రమంగా రాబట్టారని ఈడీ ఎటాచ్ చేయడంతో ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ టైటిల్ కు అన్ని విధాలా జగన్ మాత్రమే “సరైనోడు” అంటున్నాయి రాజకీయ వర్గాలు.



