ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకున్న ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనను ప్రారంభించింది. ఇందులో భాగంగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ థ్రిల్లర్ గా సాగింది. ఫైనల్ ఓవర్ వరకు ‘నువ్వా… నేనా…’ అన్నట్టు సాగిన ఈ మ్యాచ్ లో కివీస్ ను ఒడ్డుకు చేర్చి, విజయంలో కీలకపాత్ర పోషించాడు స్పిన్నర్ సంట్నేర్. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 284 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో రాయ్ (49), రూట్ (71), బట్లర్ (79) పరుగులతో రాణించారు.
ఇక లక్ష్య చేధనను న్యూజిలాండ్ అత్యంత దయనీయంగా ప్రారంభించింది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి 27 పరుగులు మాత్రమే చేసి మూడు టాపార్డర్ వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో రాస్ టేలర్, కీపర్ లతంలు కివీస్ బ్యాటింగ్ ను వెన్నమూకగా నిలిచి, నాలుగవ వికెట్ కు ఏకంగా 178 పరుగులు జోడించారు. లతం (79) పరుగులు చేసి వెనుదిరిగిన వెంటనే, మళ్ళీ వికెట్ల పతనం ప్రారంభమైంది. స్కోర్ బోర్డు 244 చేరుకోగా, 7వ వికెట్ రూపంలో టేలర్ (113) పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. దీంతో కివీస్ విజయం దాదాపుగా అసాధ్యం అనుకున్నారు.
ఈ తరుణంలో క్రీజులో ఉన్న స్పిన్నర్ సంట్నేర్ బ్యాట్ ఝుళిపించడంతో చివరి 3 ఓవర్లలో 34 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసారు. 48వ ఓవర్లో 16 పరుగులు, 49వ ఓవర్లో 9 పరుగులు చేయగా, విజయానికి కావాల్సిన 9 పరుగులను చివరి ఓవర్లో 2 బంతుల్లోనే ముగించారు. విజయం రెండు జట్లను దోబూచులాడుతూ చివరికి ఆతిధ్యం ఇస్తోన్న జట్టునే వరించడంతో స్థానికంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సెంచరీతో కివీస్ కు అండగా నిలిచిన రాస్ టేలర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.



