నారాయణ…నారాయణ… మరదలు పిల్ల హడావుడి ఏంటి?

Priya-Ponguru-Husband-Ponguru-Subrahmanyamమాజీ మంత్రి, నారాయణ గ్రూప్ విద్యాసంస్థల అధినేత, రాబోయే ఎన్నికలలో నెల్లూరు అర్బన్ నుంచి టిడిపి అభ్యర్ధిగా శాసనసభకు పోటీ చేయబోతున్న నారాయణ హటాత్తుగా మళ్ళీ మీడియా ఫోకస్‌లోకి వచ్చేశారు. వచ్చేశారనడం కంటే తేబడ్డారని చెప్పుకోవచ్చు.

ఆయన తమ్ముడు భార్య కృష్ణప్రియ మీడియా ముందుకు వచ్చి ఆయన తనను గత 29 ఏళ్లుగా లైంగిక వేధిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. తన భర్త సుబ్రహ్మణ్యం, నారాయణ ఇద్దరూ కలిసి తనను మానసికంగా, శారీరికంగా కూడా వేదిస్తున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

ADVERTISEMENT

ఆదివారం ఉదయం ఆమె హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు కూడా చేశారు. నారాయణ స్త్రీలోలుడని తన విద్యాసంస్థలలో ఎవరిపైనైనా ఆయన కన్ను పడితే వచ్చి లొంగిపోవలసిందే అని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కెమో చికిత్సలు తీసుకొంటుంటే, తాను ఓ మానసిక రోగినని వారు దుష్ప్రచారం చేయిస్తూ, తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని కృష్ణప్రియ ఆరోపించారు.

నెల్లూరు టిడిపి అభ్యర్ధిగా నారాయణ పేరుని ఖరారు చేయడంతో నెల్లూరు వైసీపీలో కలకలం మొదలైన సంగతి తెలిసిందే. నారాయణ మళ్ళీ బరిలో దిగితే ఆయనను ఎదుర్కొని నిలబడటమే చాలా కష్టం. ఇక ఓడించడం కల్ల! ఇటువంటి సమయంలో నారాయణ సొంత మరదలే మీడియా ముందుకు వచ్చి ఆయనపై ఇంత తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో వైసీపీ చాలా సంతోషిస్తుందని వేరే చెప్పక్కరలేదు. దాని సంతోషం ఆత్మసాక్షిలో ప్రతిభింబిస్తోంది. అది సహజమే.

అయితే ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు స్వయంగా నారాయణతో మాట్లాడి అసలు విషయం తెలుసుకొన్న తర్వాతే పార్టీలో ఎవరైనా స్పందించాలని గట్టిగా ఆదేశించడంతో, ఈ వ్యవహారంపై టిడిపిలో ఎవరూ ఇంతవరకు స్పందించలేదు.

అయితే నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం మీడియా ముందుకు వచ్చి, తన భార్య కృష్ణప్రియకు రెండు నెలల క్రితం క్యాన్సర్ వ్యాధి సోకిందని, ఆమెకు హైదరాబాద్‌ యశోదా హాస్పిటల్లో శస్త్రచికిత్స చేయించామని చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆమెకు కిమో థెరపీ ట్రీట్‌మెంట్ చేయిస్తున్నామని చెప్పారు.

తన భార్య చాలాకాలంగా మానసిక సమస్యలతో బాధ పడుతోందని, దానికి ఆమెకు చికిత్స చేయిస్తున్నానని చెప్పారు. అయితే క్యాన్సర్ శస్త్ర చికిత్స, కెమో చికిత్సల కారణంగా మానసిక సమస్యలకు వాడాల్సిన మందులు పూర్తిగా నిలిపివేయవలసి వచ్చిందని చెప్పారు. ఇదే సమయంలో క్యాన్సర్ రావడంతో ఆమెపై మానసిక ఒత్తిడి మరింత పెరిగిపోయిందని సుబ్రహ్మణ్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఆమె మానసిక చికిత్స, క్యాన్సర్ చికిత్సలకు సంబందించి మెడికల్ రికార్డులను మీడియాకు చూపించి, తమ గురించి ఆమె చెప్పే మాటలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తన అన్న నారాయణ గురించి తన భార్య కృష్ణప్రియ ఈవిదంగా మాట్లాడుతున్నందుకు తాను చాలా బాధపడుతున్నానని చెప్పారు. అయితే తన అన్నగారు అటువంటి వ్యక్తి కారని సుబ్రహ్మణ్యం చెప్పారు.

నారాయణ మరదలు చేస్తున్న ఈ ఆరోపణలలో నిజానిజాలు ఏమిటో వారికే తెలియాలి. కానీ వైసీపీకి ఇది బలమైన అస్త్రంగా అందివచ్చిందని చెపొచ్చు. ఆమె చేస్తున్న తీవ్రమైన ఈ ఆరోపణల వలన టిడిపి ప్రతిష్ట కూడా దెబ్బ తింటోంది కనుక మరి చంద్రబాబు నాయుడు దీనిపై ఏవిదంగా స్పందిస్తారో?

ADVERTISEMENT
Latest Stories