‘చంద్రబాబుపై రోధన – జగన్ పై భజన’ తప్ప మరొకటి తెలియని జగన్ మీడియా అయిన సాక్షి దినపత్రికకు మరియు ఎలక్ట్రానిక్ ఛానల్ కు ‘కాలం’ దగ్గర పడింది అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి స్వయంగా ప్రకటించారు. ఈ రెండింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే కార్యక్రమం బహుశా ఒకటి, రెండు రోజుల్లోనే సిద్ధం కావచ్చన్నది యనమల ఇచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. జగన్ ఆస్తులపై చర్యలకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయడంతో దాదాపు 11 ఛార్జీషీట్లలో ఉన్న 43 వేల కోట్ల ఆస్తులపై చర్యలు వేగవంతం కానున్నాయని తెలిపారు.
అక్రమాస్తులు అని తేలితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం… చట్టపరమైన చర్యలలో ఓ భాగమే. కాబట్టి దీనిపై వ్యతిరేకత గానీ, విమర్శలు గానీ వచ్చే అవకాశం లేదు. అయితే ‘సాక్షి’ దినపత్రిక, ఛానల్ కు సంబంధించి సర్వత్రా కలుగుతున్న సందేహం ఏమిటంటే… ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా సదరు దినపత్రిక, ఛానల్ మామూలుగానే కొనసాగుతాయా? లేక ఆగిపోనున్నాయా? అన్నది. ఒకవేళ కొనసాగితే… ఇప్పటివరకు జగన్ నామస్మరణ చేసిన ఛానల్లో… ప్రభుత్వానికి అనుకూలంగా మాటలు రానున్నాయా? అదే జరిగితే ‘సాక్షి’ పేరును అలాగే ఉంచేస్తారా… లేక పేరు మార్పుతో ప్రభుత్వం ప్రసారం చేస్తుందా..?
ఇలాంటి అనేకానేక సందేహాలకు యనమల వ్యాఖ్యలు తావిచ్చేలా చేసాయి. తాజాగా యనమల చేసిన ప్రకటనతో జగన్ మళ్ళీ ఢిల్లీ బాట పట్టే అవకాశాలు ఉన్నాయంటూ పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటికే కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… వచ్చే అడ్డంకులను అధిగమించి, జగన్ మీడియాను స్వాధీనం చేసుకుంటుందా అన్న అంశం ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే… ఎవరూ ఇబ్బంది పెట్టనంతగా తనను జగన్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిఎం స్వయంగా ప్రకటించిన నేపధ్యంలో… తన మీడియాను స్వాధీనం చేసుకుంటున్న కార్యక్రమాలను సజావుగా జరగనిస్తారా..?



