ఈ ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం హామీని అమలు చేయబోతున్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కనుక ఏపీఎస్ ఆర్టీసీ కూడా దీని కోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు సోమవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీలో మొత్తం 11,000 బస్సులున్నాయి. వాటిలో 74 శాతం ఈ పధకం కోసం కేటాయించాలని నిర్ణయించాము. దీని వలన పురుష ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కొత్తగా మరో 1,350 బస్సులు ఏర్పాటు చేసి రాష్ట్రంలో అన్ని డిపోలకు కేటాయిస్తున్నాము.
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 750 బస్సులను ఇప్పటికే వివిధ జిల్లాలకు కేటాయింపు ప్రక్రియ మొదలుపెట్టాము. మిగిలిన 600 బస్సులు రాగానే వాటిని కూడా జిల్లాలలో రద్దీని బట్టి కేటాయిస్తాము,” అని చెప్పారు.
ఈ సందర్భంగా ద్వారకా తిరుమల రావు మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. “ఈ పధకాన్ని కొత్త జిల్లా సరిహద్దుల వరకు పరమితం చేయకుండా పాత ఉమ్మడి జిల్లాల వరకు కొనసాగించేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
కనుక పాత 13 జిల్లాల పరిధిలో మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని, కానీ వేరే జిల్లాలో ప్రయనించాలంటే టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని అర్ధమవుతోంది.
కానీ 26 జిల్లాల ప్రకారం కాకుండా పాత 13 జిల్లాలకు దీనిని వర్తింపజేస్తున్నట్లయితే మహిళలు ఎక్కువ దూరం ఉచితంగా ప్రయాణించగలురు. కనుక వారికిది ఆమోదయోగ్యమే అవుతుంది. మరోపక్క ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూనే, ప్రభుత్వం, ఆర్టీసీపై కొద్దిగా భారం తగ్గించుకున్నట్లవుతుంది కూడా.
ఈ పధకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు లేదా విధి విధానాలు అధికారికంగా ప్రకటిస్తే గానీ దీనిపై పూర్తి స్పష్టత రాదు. బహుశః మహిళలు లక్ష్మీ పూజలు చేసుకునే శ్రావణ శుక్రవారంనాడు ప్రకటిస్తుందేమో?






