ఇరాన్ vs ట్రంప్ అన్నట్టుగా సాగుతున్న ఇరాన్ – ఇజ్రాయిల్ వార్ ఎఫెక్ట్ తో ప్రపంచం మొత్తం అల్లాడుతోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ కొరతతో అనేక దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావంతో పెట్రోల్, డీజిల్ సామాన్యుడికి మరింత ప్రియంగా మారిపోతున్నాయి.
ఇప్పటికే అనేక చిన్న దేశాలు ఈ చమురు సంక్షోభాన్ని అనుభవిస్తున్నాయి. కానీ భారతదేశం లో ప్రస్తుతానికి చమురు, వంట గ్యాస్ లకు ఎటువంటి కొరత లేదని, ప్రజలు, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ అటు కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వరకు అందరు ఎంతలా ప్రజలకు భరోసా ఇస్తున్నా వారిలో భయం మాత్రం పోవడం లేదు.
అయితే ఈ భయం వెనుక అనేక కారణాలు లేకపోలేదు. ఇప్పటికే గ్యాస్ సమస్యలతో అనేక వ్యాపార సముదాయాలు తమ వ్యాపారాన్ని కుందించుకుంటున్నాయి. దీనితో ఇక డొమెస్టిక్ సిలిండర్ల విషయంలో కూడా ప్రజలు భయాందోళనలకు గురయ్యి ఆన్ లైన్ బుకింగ్స్ తో సమస్య జాప్యమవుతుందని, అఫ్ లైన్ లో గ్యాస్ కంపెనీల ఆఫీసుల ముందు సిలిండర్లు పట్టుకుని క్యూలు కడుతున్నారు.
ఒక్కో ప్రాంతంలో అయితే గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న వాహనాలను అడ్డుకుని ఆ ఫుల్లీ లోడెడ్ సిలిండర్లను దోచుకుని వెళ్లిపోతున్నారు. ఇటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా వార్తలలో కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి కూడా. దీనితో ప్రజలలో భయం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.
వంట గ్యాస్ సిలిండర్ల వినియోగదారుల గోడు ఇలా ఉంటే ఇక పెట్రోల్, డీజిల్ వినియోగదారుల కష్టాలు మరోలా సాగుతున్నాయి. ఇరాన్ యుద్ధం ఇప్పటికి ఒకకొలొక్కి రాకపోవడం, శాంతి చర్చలంటూ ఇరాన్ – అమెరికా చేస్తున్న ప్రకటనల వెనుక కూడా పూర్తి వ్యత్యాసం ఉండడంతో ఇక రానున్న రోజులలో ఈ చమురు సప్లై సమస్య మరింత ఉదృతం అయ్యే అవకాశం ఉందనే ఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని ఇళ్లలో స్టోర్ చేసుకుంటున్నారు.
వాటర్ క్యాన్లు, ఇళ్లలో ఉండే పెద్ద పెద్ద ఖాళీ సామానులలో కూడా పెట్రోల్, డీజిల్ కొని నిల్వ చేసుకుంటున్న ఘటనలు చూస్తున్నాం. దీనితో అసలు అవసరమైన వారికీ ఈ చమురు కొరత ఏర్పడుతుంది. ఇక కొన్ని చోట్ల పెట్రోల్ బ్యాంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో బండిలో పెట్రోల్ నింపుకోవడానికి ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ ఖాళీ అవుతుందంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
ఒక పక్క సిలిండర్ల కోసం గ్యాస్ కంపెనీల ఆఫీసుల ముందు ఖాళీ సిలిండర్లతో ప్రజలు క్యూలు కడుతుంటే మరోపక్క బైకులు, కార్లలో ఇంధనం నింపుకోవడానికి పెట్రోల్ బ్యాంకుల ముందు క్యూలు కడుతున్నారు వాహనదారులు. అయితే ఈ క్యూ లైన్ల వెనుక కొరత కంటే కూడా భయమే ఎక్కువ ప్రజలను ఆందోళనలోకి నెడుతుంది అనేది స్పష్టమవుతుంది.






