ఇంతకాలం సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ అప్పు చేసి పప్పు కూడు చందాన్న నిర్వహిస్తున్న సంక్షేమ పధకాలతో తమ ప్రభుత్వానికి తిరుగే ఉండదనే గట్టి నమ్మకంతో ఉండేవారు. కానీ ఇటీవల అట్టహాసంగా ప్రారంభించిన గడప గడపకు వైసీపీ కార్యక్రమం వారి భ్రమలను పటాపంచలు చేసేస్తోంది.
సంక్షేమ పధకాల గురించి చెప్పుకొని ఆశీర్వదించమని అడుగుదామని వెళుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గడప గడపకు ప్రజల నుంచి ప్రశ్నలు, నిలదీతలు ఎదురవుతుండటంతో ఈ కార్యక్రమం వారికి ఓ పెద్ద అగ్ని పరీక్షగా మారింది.
సంక్షేమ పధకాల పేరుతో ఎన్ని వేలకోట్లు డబ్బు ప్రజలకు పంచిపెట్టినా దాంతో వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడం చాలా కష్టమనే చేదు నిజం ఇపుడే వారికి అర్దమవుతోంది.
గడప గడపకు కార్యక్రమంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని వైసీపీ ఎమ్మెల్యేలు బహుశః ముందుగానే పసిగట్టారో ఏమో ఉగాదినాటి నుంచి మొదలవవలసిన ఈ కార్యక్రమాన్ని రెండు సార్లు వాయిదా వేయించి చివరికి అధినేత గట్టిగా హెచ్చరించడంతో మే 10 నుంచి మొదలుపెట్టారు.
అయితే ఈ కార్యక్రమంలో తమ సాటి నేతలకు ప్రజల నుంచి ఎదురవుతున్న చేదు అనుభవాలను టీవీలలో కళ్ళారా చూస్తున్న మిగిలినవారు ఈ కార్యక్రమానికి ఏదో వంకతో హాజరుకాకుండా అనుచరులను పంపించి తప్పించుకొంటున్నారు.
పోనీ…ప్రజల తిట్లనే దీవెనలుగా భావించి ఏదో విదంగా ఈ కార్యక్రమాన్ని ‘మమ’ అనిపించేద్దామనుకొన్న కొందరికి మరో సమస్య ఎదురవుతోంది. ఇటీవల మంత్రి పదవులు ఊడిపోయినవారు ఇప్పుడు ‘గడప గడపకు తిరిగి ఏం ప్రయోజనం? క్రెడిట్ అంతా కొత్త మంత్రులకే పోతుంది కదా?” అని నిర్వేదంతో గడప దాటడం లేదని తెలుస్తోంది.
రెండోసారి మంత్రివర్గ విస్తరణలో పదవులు ఆశించి భంగపడినవారు, “అధినేత తమను పట్టించుకోనప్పుడు గడప గడపకు తిరిగి ప్రజల చేత తిట్లు తినాల్సిన ఖర్మ మాకేమిటి?” అని గడప దాటి బయటకు రావడం లేదని తెలుస్తోంది.
ఇక కొత్త మంత్రులు హుషారుగా ప్రజల వద్దకు వెళితే పాత మంత్రుల నిర్వాకంతో ప్రజల చేత తాము తిట్లు తినాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు.
కనుక ఈ కార్యక్రమం పేరు మార్చి గడప గడపకు అగ్నిపరీక్ష అని పెట్టుకొంటే బాగుండేదేమో?అని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయినా ప్రజల వద్దకు వెళ్ళకపోతే వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వనని అధినేత ముందే బొట్టు పెట్టి మరీ హెచ్చరించి ప్రజల గడపల వద్దకు పంపించడంతో వైసీపీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది పాపం.



