బిఆర్ఎస్ అల్పసంతోషం… ఎన్ని రోజులు?

Gadwal MLA Bandla Krishna Mohan Reddy Return To BRS

తెలంగాణలో తిరుగేలేదనుకున్న బిఆర్ఎస్ పార్టీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఓడిపోవడంతో కేసీఆర్‌ తలెత్తుకొని తిరుగలేకపోతున్నారు. పైగా పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఉన్న నలుగురు ఎంపీలు అందరూ కాంగ్రెస్‌, బీజేపీలలోకి వెళ్ళిపోవడంతో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రావడం మానుకున్నారు.

ADVERTISEMENT

ఇదివరకు తెలంగాణ అంటే కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్‌ అన్నట్లు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మొహం చెల్లక శాసనసభ సమావేశాలకు వెళ్ళడం మానుకున్నారు.

కనుక ఇప్పుడు ఆయన కుమారుడు కేటీఆర్‌, మేనల్లుడు హరీష్ రావు ఇద్దరే బిఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్నారు. కేసీఆర్‌ బయటకు రాకపోవడంతో వారిద్దరికీ శాసనసభలో, బయటా కూడా తమ సత్తా చాటుకునే అవకాశం లభించిందని చెప్పవచ్చు. శాసనసభ సమావేశాలలో ఇద్దరూ సిఎం రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్‌ మంత్రులను ధీటుగా ఎదుర్కొంటున్నారు.

అయితే అంత మాత్రన్న బిఆర్ఎస్ పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదనే చెప్పవచ్చు. కనుక బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిలో ఎంత చిన్న సంతోషమైనా చాలా గొప్పగానే కనిపిస్తుంది.

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చేశారు. ఆయన రాకతో కేటీఆర్‌, బిఆర్ఎస్ సీనియర్ నేతలు చాలా సంతోషపడుతున్నారు. ‘ఇప్పుడు రాస్కోండి బిఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్‌ అబ్బా’ అంటూ కృష్ణమోహన్ రెడ్డితో దిగిన ఫోటో, వీడియోని ఆ పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

అయితే ఇది అల్పసంతోషమే అని బిఆర్ఎస్ పార్టీ నేతలందరికీ తెలుసు. కనుక వారి అల్పసంతోషాన్ని ఎవరూ కాదనలేరు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులలో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకో కొంచెం గ్యాప్ ఇచ్చింది. కనుక మళ్ళీ మొదలైతే వారు ఈ అల్పసంతోషానికి కూడా నోచుకోలేరు… పాపం!

ADVERTISEMENT
Latest Stories