టీడీపీ గుంటూరు ఎంపీగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం తన గళం వినిపించిన పార్లమెంట్ కీలక నేతగా గల్లా జయదేవ్ కు టీడీపీ పార్టీలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సైతం ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న మాట వాస్తవం.
ఉన్నత విద్య, నిర్దిష్టమైన వ్యాపారాలు, విలువలు కలిగిన రాజకీయం, పార్టీకి విధేయుడిగా, పార్టీ అధినేతకు నమ్మదగ్గ నాయకుడిగా గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు.
2019 లో వైసీపీ హవాను సైతం తట్టుకుని గుంటూరు టీడీపీ ఎంపీగా రెండవసారి ప్రజల మన్ననలు పొందారు. అయితే 2019 నుంచి 2024 వరకు సాగిన వైసీపీ అరాచక పాలనలో గల్లా ఆర్థికంగా నష్టపోయారు.
అలాగే ప్రభుత్వ కక్ష్య రాజకీయాలతో నలిగిపోయారు. చిత్తూరు కేంద్రంగా ఉన్న అమర్ రాజా బ్యాటరీ సంస్థను గత వైసీపీ ప్రభుత్వం నిబంధనల పేరుతో కక్ష్య పూరితంగా వ్యవహరించడంతో ఆ పరిశ్రమను గల్లా ఏపీ నుంచి హైద్రాబాద్ కు తరలించారు.
దీనితో 2024 ఎన్నికల నుంచి తప్పుకున్న జయదేవ్ పూర్తిగా తన వ్యాపార కార్యక్రమాలతో బిజీ అయిపోయారు. 2024 ఎన్నికలలో కూటమి హావ కొనసాగిన సమయంలో గల్లా వెనకడుగు వేయకుంటే నేడు ఏపీ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రులలో గల్లా కూడా ఒక నేతగా ఉండేవారు అనేది రాజకీయాలలో తీవ్రంగా చర్చ జరిగిన అంశం.
అయితే జయదేవ్ రాజకీయాలకు దూరంగా జరిగినప్పటికీ టీడీపీ కి దూరం కాలేకపోతున్నారు. తాజాగా కాణిపాకం వినాయకుని దర్శనానికి వచ్చిన గల్లా జయదేవ్ తన పొలిటికల్ రీ ఎంట్రీ మీద కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దీనితో గల్లా రాజ్యసభకు వెళ్లనున్నారా అన్న చర్చ ఊపందుకుంది.
దేవుడు కరుణిస్తే, తిరిగి అవకాశం దొరికితే తానూ పొలిటికల్ రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నానని, ఆ విషయమై టీడీపీ అధినాయకత్వంతో మాట్లాడుతున్నట్టు ప్రకటించారు గల్లా. అయితే ఇప్పుడున్న పొత్తుల పరిస్థితుల దృష్ట్యా, గల్లా ప్రతిపాదనను బాబు అంగీకరిస్తారా.? ఆ దిశగా గల్లా ను రాజ్యసభకు పంపేందుకు టీడీపీ ఆయన కోసం గేట్లు తీస్తుందా.? అనేది చూడాలి.






