కొన్నిసార్లు జగన్ హడావుడి చేస్తుంటారు. కొన్నిసార్లు కల్వకుంట్ల కవిత, ఆ తర్వాత మమతా బెనర్జీ, విజయ్ దళపతి ఇంకా చాలా మందే హడావుడి చేశారు.
అందరి గురించి చెప్పుకొని ట్రంప్, పుతిన్ పేర్లు చెప్పుకోకపోతే వారు నొచ్చుకుంటారు. ఒకరి తర్వాత ఒకరు చేసిన హడావుడి మామూలుగా లేదు. వారి దెబ్బలకి ప్రపంచంలో చమురు సంక్షోభం ఏర్పడితే, దానినీ వారు మంచి బిజినెస్గా మార్చుకున్నారు. ఇద్దరూ మిత్ర దేశాలకు భారీగా ఆయుధాలు కూడా అమ్ముకున్నారు.
వారి పుణ్యామాని భారత్లో వంట గ్యాస్ ట్రబుల్ మొదలైంది. నేటికీ 140+ కోట్ల మంది జనాలు దాంతో బాధపడుతూనే ఉన్నారు.
కానీ కొరత గిరతా ఏమీ లేదు.. అంతా ప్రతిపక్షాల దుష్ప్రచారం అంతే… గుజరాత్కి గ్యాస్ తీసుకువస్తున్న ఈ షిప్పులు చూడండి.. అంటూ ఫోటోలు చూపుతున్నారు… కానీ అదంతా ఒట్టి గ్యాస్ అని రాహుల్ గాంధీ కొట్టిపడేస్తున్నారు.
ఈ గ్యాస్ ట్రబుల్ ఇంకా తగ్గక మునుపే పెట్రోల్, డీజిల్ ధరలతో భగ్గుమనిపించారు ప్రధాని మోడీ. కానీ రోగులకు అర్థం కాని బాషలో వైద్యులు వ్రాసిన ప్రిస్క్రిప్షన్లా ప్రధాని మోడీ కూడా దేశ ప్రజలకు ఈ కష్టాలు అధిగమించడానికి కొన్ని ఉపాయాలు చెప్పారు. ఏడాది వరకు బంగారం కొనొద్దని, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, విదేశీ పర్యటనలకు వెళ్ళవద్దని చక్కటి సలహాలు చెప్పి ప్రత్యేక విమానంలో విదేశాలకు వెళ్ళిపోయారు.
ప్రధాని మోడీ మాటని గౌరవిస్తూ దారిద్యరేఖకు దిగువన ఉన్నవారందరూ, అలాగే కాస్త ఎగువన.. మధ్యతరగతిలో దిగువన ఉన్నవారందరూ బంగారం కొనడం మానేశారు. తప్పనిసరి పరిస్థితిలో చావులు, పెళ్ళిళ్ళకు వెళ్తున్నారే తప్ప ఎవరూ విదేశాలకు వెళ్ళాలనుకోవడం లేదు.
దేశంలో జనాలు అయన మాట విని చంద్రబాబు నాయుడుతో సహా పలువురు బిజేపి, ఎన్డీయే సిఎంలు కాన్వాయ్లు తగ్గించేసుకున్నారు. అది వేరే సంగతి.
కానీ ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ప్రధాని మోడీ చెప్పిన ఈ మూడు ముక్కలు పట్టుకొని అందరూ ఓ వారం పదిరోజులు ‘గ్యాస్ ట్రబుల్’ మరిచి హాయిగా కాలక్షేపం చేసేశారు.
పొద్దున్న భోజనం చేశామని రాత్రి ఆకలి వేయకుండా ఉండదు.. రాత్రి చేస్తే తెల్లారేసరికి ఆకలి తప్పదన్నట్లు, ఎన్ని కబుర్లు చెప్పుకొని ఎంత కాలక్షేపం చేసినా మళ్ళీ గ్యాస్ ట్రబుల్ మాత్రం తప్పడం లేదు.




