దేశం సస్యశ్యామలంగా ఉంది. అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. భారత్ ఆర్ధిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. త్వరలో అగ్రరాజ్యాల సరసన భారత్ నిలవబోతోంది.
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు… మన పాలకులు చెప్పే ఈ మాటలన్నీ నిజమైతే ఎంత గొప్పగా ఉంటుందో కదా!
కానీ వాస్తవాలు చాలా భిన్నంగా, చాలా చేదుగా ఉన్నాయి. దేశంలో సమస్యలు క్రమంగా భరించలేని స్థాయికి చేరుకుంటున్నాయి.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేనే లేదని పాలకులు చెపుతుంటే, రెండు రాష్ట్రాలలో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరి కనిపిస్తుంటాయి. అదీ ప్రతిపక్షాల దుష్ప్రచారమేనట!
గ్యాస్ కొరత లేదు. గ్యాస్ ధర పెంచే ఆలోచన లేదని చెప్తారు. కానీ గృహావసరాలకు కూడా గ్యాస్ దొరకదు.
19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూనే ఉన్నారు. నిన్న అర్దరాత్రి నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఒకేసారి రూ.993 చొప్పున పెంచేశారు!
ఇప్పటికే గ్యాస్ దొరక్క రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్స్ సైతం మూతపడ్డాయి. ఇప్పుడు ఒకేసారి ఇంత పెంచేసినందున వాణిజ్య గ్యాస్ వాడుతున్న హోటల్స్లో, స్వీట్ షాప్స్, బేకరీలు ఈ భారం మోయలేవు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్స్ బ్లాకులో రెండు మూడు వేలు చొప్పున కొంటున్నందున ఆ భారాన్ని ప్రజలపైనే వేస్తున్నాయి.
ఇప్పుడు మరోసారి గ్యాస్ ధర ఇంతగా పెరగడంతో బ్లాకులో ధర కూడా పెరుగుతుంది. కనుక ఈ భారాన్ని కూడా ప్రజలపైనే వేయక తప్పదు. సాధ్యం కాదనుకుంటే వ్యాపారాలు మూసుకోక తప్పదు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ కొనలేని పరిస్థితిలో వ్యాపారస్తులు తప్పనిసరిగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ బ్లాకులో కొంటారు. కనుక గ్యాస్ ఏజన్సీలు, గ్యాస్ డెలివరీ బాయ్స్ ఆడిందే ఆట అన్నట్లు సాగుతోంది.
ఈవిధంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ పక్కదారి పడుతుండటంతో గృహస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాటికీ సప్లై తగ్గి డిమాండ్ పెరిగింది. పైగా ఎన్నికలు కూడా ముగిశాయి కనుక నేడో రేపో డొమెస్టిక్ గ్యాస్ బాదుడు కూడా తప్పదు. ఎప్పుడు ఎంత? అనేది మాత్రమే తెలియాల్సి ఉంది.
ఓ పక్క నిత్యం వేలాది మంది ఉద్యోగాలు ఊడుతూనే ఉన్నాయి. మరోపక్క దేశంలో నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఏటా లక్షల మంది యువత డిగ్రీలు పూర్తి చేసి బయటకు వస్తూనే ఉన్నారు. వారికీ ఉద్యోగాలు దొరకడం లేదు. దొరికినవారికి ఊడుతున్నాయి.
పోనీ విదేశాలకు వలస పోదామంటే అక్కడా ట్రంప్ లాంటివాళ్ళు మెడ పట్టుకొని గెంటేస్తున్నారు. సరే.. ఏదో వ్యాపారం చేసుకొని బ్రతుకుదామనుకుంటే అలా కూడా బ్రతకనీయడం లేదు. ఇలా రోడ్డున పడేస్తున్నారు!
ఈవిధంగా ఒక్కో సమస్య, కారణంతో దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే ఎవరైనా వక్రమార్గం పట్టకుండా ఉంటారా? అని ఆలోచించే తీరిక, ఆసక్తి పాలకులకు లేవు.
తమ కుటుంబాలు, తమ పార్టీలు, తమ ప్రభుత్వాలు, తమ ఆస్తిపాస్తులు, తమ వ్యాపారాలు, తమ పదవులు అధికారం చల్లగా ఉంటే చాలు. దేశం, ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం.
అందువల్లే దేశం సస్యశ్యామలంగా ఉంది. అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నమ్మాల్సిందే.. ఎందుకంటే ప్రజలకు వేరే ఆప్షన్ లేదు కనుక!




