ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు గొల్లపూడి మారుతీరావు తనను కొట్టిన విషయం వాస్తవమేనని ఒకప్పటి కథానాయిక పూర్ణిమ అన్నారు. జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ‘ముద్ద మందారం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన నాటి నటి పూర్ణిమ, తన తాజా ఇంటర్వ్యూలో ఈ అనుభవాలను పంచుకుంది.
1983లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘మనిషికో చరిత్ర’ చిత్రంలో గొల్లపూడి మారుతీరావు గారికి కూతురి పాత్రలో నటించాను. మా ఇద్దరి మధ్య షూట్ చేయాల్సిన ఒక సన్నివేశం కోసం రిహార్సల్ చేశాం. అందులో పర్ ఫెక్ట్ గా చేశాను గానీ, షూట్ చేసే సమయానికి మాత్రం నేను చెప్పాల్సిన డైలాగ్ మర్చిపోతున్నాను. ఈ క్రమంలో, చాలా టేక్ లు తీసుకున్నాను. ఆ సమయంలోనే గొల్లపూడి నా చెంపపై కొట్టడంతో, నేను కిందపడిపోయానని చెప్పింది పూర్ణిమ.
అయితే ఆ తర్వాత నా ముఖంపై నీళ్లు చల్లి సపర్యలు చేశారని, ఈ సందర్భంలో అక్కడే ఉన్న మా నాన్న గారు, ఈ విషయంపై గొల్లపూడితో గొడవకు దిగారని నాటి విషయాలను గుర్తు చేసుకుంది పూర్ణిమ. అయితే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు సహజమేనని, చివరికి ఇవే ఓ అనుభూతుల్లా చెప్పుకుంటుంటారని సినీ జనాలే పేర్కొంటుంటారు.



