ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రురల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాడిస్ట్ వ్యక్తి సీఎం అవడం మన దౌర్భాగ్యం అని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిలో దాదాపుగా రెండు నెలల పాటు నిరసన తెలుపుతున్న రైతులకు ఆయన ఈరోజు సంఘీభావం తెలిపారు.
తనతో పాటు తన నియోజకవర్గంలోని రైతులను కూడా తీసుకొనిపోయారు. ఈ క్రమంలో ఆయన జగన్పై నిప్పులు చెరిగారు. జగన్ అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రం నాశనం అవుతోందన్నారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసం నేడు పోరాటం సాగుతోందన్నారు. 29 గ్రామాల ఉద్యమంగా చిత్రీకరించడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని వర్గాల రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. “కోట్లు దోచుకుని, 14కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆలస్యం అయినా తగిన శిక్ష అనుభవించడం ఖాయం. రాష్ట్ర ప్రజలందరూ అమరావతి రాజధానిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు’ అని బుచ్చయ్య చెప్పుకొచ్చారు.
అసలు రాజధాని ఎందుకు మారుస్తున్నారో జగన్ ప్రజలకు చెప్పాలి. వేల కోట్లు అభివృద్ధి పనులు అమరావతిలో జరిగాయి. విశాఖపట్నంలో భూదందాలు చేసేందుకే రాజధాని మార్పు నిర్ణయం అని ఆయన ఆరోపించారు. ఇది ఇలా ఉండగా బుచ్చయ్య పేరుతో ఆపరేట్ అవుతున్న ట్విట్టర్ అకౌంట్ కూడా జగన్ ప్రభుత్వ విమర్శలు మీద ఛలోక్తులతో కూడిన విమర్శలు చేస్తూ ఉంటుంది.



