గత ఏడాది దేశవ్యాప్తంగా వైరల్ అయిన వీడియోలలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కూడా ఒకటి. దాని వలన ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలలో వైసీపీ తలదించుకోవలసి వచ్చింది. ఆయన ఎంపీ కావడంతో జాతీయస్థాయిలో కూడా వైసీపీకి తీరని అప్రదిష్టకలిగింది. అప్పటి నుంచే సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను పక్కన పెట్టేశారు. ఈసారి ఎన్నికలలో మళ్ళీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బహుశః అందుకే ఆయన పూర్తిగా సైలంట్ అయిపోయారని కొందరు వాదిస్తుండగా, ఈ గొడవ కారణంగా మీడియాకు దూరంగా ఉండిపోవలసి వచ్చిందని మరికొందరు వాదిస్తున్నారు. ఇదే అదునుగా హిందూపురం వైసీపీలో ఇద్దరు సీనియర్ నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కనుక గోరంట్ల మాధవ్ ఇక తాడోపేడో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది.
సరిగ్గా ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో బాబు ష్యూరిటీ – భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నిన్న గుత్తి పట్టణంలో సభ నిర్వహించబోతున్నట్లు తెలుసుకొన్న గోరంట్ల మాధవ్ హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించడం వలననే సిఎం జగన్మోహన్ రెడ్డి గురించి అనుచితంగా మాట్లాడారని. అందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే గుత్తిలో సభను అడ్డుకొంటానని హెచ్చరించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ దంపతులు తెలుగు ప్రజల ఇంటి ఇలవేలుపులని, వారి కుమారుడైన ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన సాగిస్తున్నారంటూ చాలా పొగిడారు. అటువంటి గొప్ప కుటుంబంపై చంద్రబాబు నాయుడు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడితే సహించబోనని తీవ్రంగా హెచ్చరించారు.
అయితే గుత్తిలో చంద్రబాబు నాయుడి సభకు వేలాదిగా జనాలు తరలిరావడంతో గోరంట్ల మాధవ్ ఏమి చేయాలో పాలుపోక సైలంట్ అయిపోయారు. గోరంట్ల మాధవ్ వైఎస్ కుటుంబాన్ని పొగడటం, చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరగటం రెండూ టికెట్ కోసమే అని అర్దమవుతుంది. కానీ ఇన్ని ప్రగల్భాలు పలికిన తర్వాత చంద్రబాబు నాయుడు గుత్తి పట్టణంలో నిన్న సభ నిర్వహిస్తే గోరంట్ల మాధవ్ సైలంట్ అయిపోయారు. ఇలా అయితే మరి టికెట్ ఎలా వస్తుంది?



