తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్ నిర్వహించి ఈ నెల 21న మెయిన్స్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరోపక్క తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ప్రిలిమ్స్ వ్రాసిన కొందరు అభ్యర్ధులు ఆందోళనలు చేస్తున్నారు. వారికి అండగా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు నిలుస్తున్నాయి.
అవి జోక్యం చేసుకొని రాజకీయాలు చేస్తుండటంతో మెయిన్స్కి హాజరుకాబోతున్న అభ్యర్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే మెయిన్స్ నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 21న నిర్వహించేందుకు ప్రభుత్వం చురుకుగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేస్తూ అభ్యర్ధుల జీవితాలతో ఆటలాడుకొంటున్నాయని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీ చేయకుండా నాటకాలు ఆడిందని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భర్తీ చేసేందుకు పూనుకుంటే రెండు పార్టీలు అడ్డుపడుతున్నాయని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా నిరుద్యోగులని సచివాలయం, ప్రగతి భవన్లోకి రానిచ్చారా?పోటీ పరీక్షల కోసం లక్షల మంది నిరుద్యోగులు ఏళ్ళ తరబడి హైదరాబాద్లో హాస్టల్స్ లో ఉంటూ కోచింగ్ తీసుకొంటూ సిద్దమవుతుంటారు.
తీరాచేసి పరీక్షలు నిర్వహించే సమయానికి నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి జీవితాలతో ఆడుకొంటున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కనుక నిరుద్యోగులు ఈ రెండు పార్టీల మాయలో పడవద్దని సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రేవంత్ రెడ్డి చెప్పిన్నట్లుగా కేసీఆర్ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్స్, పరీక్షలు అంటూ హడావుడి చేయడమే తప్ప ఆ ప్రక్రియ పూర్తిచేయలేకపోయారు. మద్యలో టీజీపీఎస్ఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలు, కోర్టు కేసులు, వాటి వలన పరీక్షలు వాయిదాలు, రద్దు వంటి కధలు చాలా నడిచాయి.
ఆ కారణంగా లక్షల మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. పోటీ పరీక్షలలో అర్హత సాధించినవారికి ఆ పరీక్షలు రద్దు అయితే ఎంత బాధ, ఎంత నష్టం జరిగి ఉంటుందో ఎవరూ ఊహించుకోలేరు.
అందుకే రేవంత్ రెడ్డి ఈ రాజకీయాల ఉచ్చులో చిక్కుకొని నష్టపోవద్దని, జాబ్ క్యాలండర్ క్యాలండర్ ప్రకారం వరుసగా వచ్చే ఉద్యోగాల కోసం సిద్దం అవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయంగా పైచేయి సాధించడానికి పోటీ పరీక్షలపై కూడా రాజకీయాలు జరుగుతుండటం చాలా బాధాకరమే కదా?




