జగన్ ప్రభుత్వానికి రాజధాని అమరావతి నిర్మించాలని ఏమాత్రం ఆసక్తి లేదని నిరూపించేందుకు ఇది మరో తాజా ఉదాహరణ. అమరావతిలో గ్రూప్-4 ఉద్యోగుల కొరకు టిడిపి ప్రభుత్వం 7.76 ఎకరాలలో ఆరు టవర్లు నిర్మించించి. ఒక్కో టవరులో 120 చొప్పున మొత్తం 720 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్ 900 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించింది.
గ్రూప్-4 ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న ఈ టవర్లలో పనులు చాలావరకు పూర్తయిపోయాయి. కనుక మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తిచేసి ఒక టవరును లీజుకి ఇస్తే దానిద్వారా ఏడాదికి సుమారు రూ.8-10 కోట్లు వరకు ఆదాయం వస్తుందని సిఆర్డీఏ చెప్పడంతో ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. డి-1 టవరును విట్ యూనివర్సిటీకి లీజుకి ఇచ్చేందుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.
అమరావతి నిర్మాణాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జగన్ ప్రభుత్వం, హైకోర్టు ఆదేశం మేరకు అయిష్టంగా పనులు ప్రారంభించింది. అయితే రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదని చెపుతూ అమరావతిలో 248.34 ఎకరాలను ఎకరం రూ.10 కోట్లు చొప్పున అమ్మేందుకు ప్రభుత్వం జీవో నంబర్ 389ని జారీ చేసింది.
గత ప్రభుత్వం మెడ్సిటీ నిర్మాణం కోసం ఇచ్చిన 100 ఎకరాలను, లండన్ కింగ్స్ కాలేజీ నిర్మాణం కోసం ఇచ్చిన 148 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతలో అంటే వచ్చే ఏడాదిలో మరో 600ఎకరాలను వేలం వేయాలని నిర్ణయించింది.
ఇప్పుడు కేవలం రూ.8-10 కోట్లు కోసం గ్రూప్-డి ఉద్యోగుల కోసం గత ప్రభుత్వం నిర్మించిన క్వార్టర్లను కూడా లీజుకు ఇచ్చేందుకు సిద్దపడుతుండటం గమనిస్తే, రాజధాని నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం ఆసక్తిలేదని స్పష్టం అవుతోంది.
ఒకవేళ వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా భావిస్తున్నట్లయితే భూములు అమ్మగా వచ్చే డబ్బుతో అసంపూర్తిగా ఉన్న భవన సముదాయాలన్నిటినీ పూర్తిచేసి ఉద్యోగులకు కేటాయించి ఉండేది. కానీ ప్రభుత్వానికి ఆ ఉద్దేశ్యం లేదు కనుకనే ఈవిదంగా చేస్తోందని భావించవచ్చు.
గత ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడుని నిత్యం విమర్శిస్తూ, ఆయన ప్రభుత్వం కట్టించిన సచివాలయంలో నుంచే పరిపాలన చేస్తూ, ఆయన ప్రభుత్వం సమకూర్చి పెట్టిన భూములను ఒకటొకటిగా అమ్ముకొంటూ, చివరికి కేవలం రూ.8-10 కోట్లు కోసం టిడిపి ప్రభుత్వం కట్టించిన భవనాలను కూడా లీజుకి ఇచ్చుకొనే దుస్థితికి వైసీపీ ప్రభుత్వం చేరుకొంది.



