‘కూల్చివేత’లతో…’కూలి’ పోతుందేవరు..?

HYDRAA Demolitions Unauthorised Structures

హైద్రాబాద్ లో మొదలైన హైడ్రా చిచ్చు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎగిసి పడుతూనే ఉంది. కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైడ్రాకు మద్దతిస్తుంటే మరికొందరు హైడ్రా నిర్ణయంతో వ్యతిరేకిస్తూ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.

ప్రభుత్వ భూములను, ప్రకృతి వనరులను అక్రమంగా ఆక్రమించి బడా బాబులు, రాజకీయ నాయకులు నిర్మించుకున్న విలాసవంత నిర్మాణాల కూల్చివేతలకు మద్దతు తెలిపిన వారు సైతం మరికొన్ని కూల్చివేతలను తప్పుబడుతున్నారు. అటువంటి బడాబాబుల నిర్మాణాలను కూల్చివేయడం వలన వచ్చే నష్టం వారు తిరిగి ఎదో ఒక రూపంలో ప్రభుత్వాలు మారినప్పుడో, ప్రభుత్వాలను మార్చిగలిగినప్పుడో దక్కించుకుంటారు.

ADVERTISEMENT

కానీ..తిని తినక, ఇంతా అంతా పోగేసి కట్టుకున్న నిర్మాణాలను, కొనుకున్న స్థలాలను ప్రభుత్వాలు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారు అంటూ సాధారణ మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేసి అక్రమ పద్దతులలో అనుమతులు తెచ్చి అన్ని సక్రమమే అన్నట్లు నమ్మించి కట్టిన భవనాలను అమాయకంగా నమ్మి కొన్న సామాన్యుడు ఇప్పుడు రోడ్డు పాలవుతున్నారు.

తాము చెయ్యని నేరానికి, తమకు అంటని పాపానికి తమను భాద్యులను చేస్తూ తమ బతుకులను కూలుస్తున్నారు అంటూ గొల్లు మంటున్నారు బాధితులు. అసలు ఈఅక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులను బాధ్యులుగా చెయ్యాల్సిన ప్రభుత్వం అభం శుభం తెలియని మా మీద చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న సామాన్యుడి నుండి ఉత్పన్నమవుతుంది.

చేతులు తడిపితే అక్రమాన్ని సక్రమంగా మార్చే అధికారులు బాగానే ఉంటున్నారు, మానేజ్ చేసి నిర్మాణాలు చేపట్టిన కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు చేతులు దులుపుకుంటున్నారు. చివరికి ప్రభుత్వ నిర్ణయాలతో బలి పీఠం ఎక్కుతున్నది మా లాంటి సామాన్యుడే అనేది వారి ఆవేదన. దీనికి న్యాయం చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటూ నిలదీస్తున్నారు బాధిత కుటుంబాలు.

అయితే వారి ఆవేదనకు ఒక అర్ధం ఉంది, అసలు ఇది నిర్మాణాలకు అనువైన భూమి కాదు అని ప్రభుత్వ అధికారులకు తెలిసి కూడా లంచాలకు కక్రుత్తి పడో, లేక ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఒత్తిడిలకు తలొగ్గొ వారు అప్పుడు అనుమతులు ఇచ్చి ఇప్పుడు చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులు మారారు, కానీ పాలన విధానాలు మాత్రం మారుతూనే వస్తున్నాయి.

ఒకరి ప్రభుత్వంలో సక్రమమే అంటూ అనుమతులొస్తే మరో ప్రభుత్వంలో అది అక్రమ నిర్మాణంగా కూల్చివేతలకు బలవుతుంది. ఈ పాపంలో ప్రభుత్వ అధికారుల పాత్ర కీలకం, అలాగే ఇలా చెరువులను ఆక్రమించి, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన అపార్టుమెంట్లు, గ్రేటెడ్ కమ్యూనిటీస్ నిర్మించిన బిల్డర్స్ కూడా దీనికి బాధ్యత వహించి బాధితులకు న్యాయం చేయాలి అనే వాదన ఊపందుకుంది.

అలాగే ఇటువంటి తప్పుడు లే అవుట్ లు సృష్టించి ప్రజలను మభ్య పెట్టి పెట్టుబడులు పెట్టిస్తున్న ఫేక్ రియల్టర్లను కూడా దీనికి భాద్యులను చేస్తూ ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకు రావాలి. అప్పుడే ఈ హైడ్రాకు విరామం, సామాన్యుడికి విముక్తి దొరుకుతుంది. లేకుంటే ఈ కూల్చివేతలతో ఎన్నో సామాన్య కుటుంబాల బతుకులు కూలిపోకతప్పదు. అవన్నీ కూడా ప్రభుత్వ పట్ల వ్యతిరేకతను సృష్టించకమానదు.

ADVERTISEMENT
Latest Stories