ప్రజలు ఎన్నుకున్న రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వాలను నడిపిస్తుంటారు. వారి నిర్ణయాలను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అమలు చేస్తుంటారు.
కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. కానీ అధికారులు ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం నడుచుకున్నా కూడా ప్రభుత్వం మారినప్పుడు కేసులలో చిక్కుక్కుంటారు. ఇక స్వామిభక్తి, అత్యుత్సాహం ప్రదర్శించినవారి పరిస్థితి సరేసరి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటువంటివారు కోకొల్లలున్నారు.
ఉదాహరణకు తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సభర్వాల్ గురించి చెప్పుకోవచ్చు. కేసీఆర్ హయంలో ఆమె సీఎంవోలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ఆయన ఆదేశం మేరకు తరచూ కాళేశ్వరం పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తుండేవారు.
కనుక సిఎం కేసీఆర్కు, మంత్రివర్గానికి ఆమె కాళేశ్వరం నివేదికలు సమర్పించేవారు. వాటి ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుండేది.. అని కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమీషన్ నివేదికలో పేర్కొంది.
ఆమె ప్రభుత్వంలో ఓ సీనియర్ అధికారిణిగా అప్పటి సిఎం కేసీఆర్ ఆదేశానుసారం పని చేస్తూ తన బాధ్యతలు నిర్వర్తించారని అర్ధమవుతూనే ఉంది. కానీ ఆవిదంగా పని చేయడమే నేరంగా మారింది.
తన ప్రమేయం లేకుండానే ఆమె ఈ కేసులో భాగస్వామిగా మారిపోయారు. కనుక ఆమె తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించి ఈ కేసులో తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
కేటీఆర్, హరీష్ రావు తదితరులు నేటికీ కాళేశ్వరం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. దానిలో ఎటువంటి అవకతవకలు జరుగలేదని వాదిస్తూనే, జరిగిన లోపాలకు అధికారులదే పూర్తి బాధ్యత తప్ప తమని నిందించడం సరికాదని కేసీఆర్, హరీష్ రావు స్పష్టం చేశారు.
అంటే కీలక నిర్ణయాలు తీసుకునేది… వాటి వలన రాజకీయంగా, ఆర్ధికం లబ్ది పొందేది ప్రభుత్వ పెద్దలు. కానీ వారి నిర్ణయాలు అమలు చేసిన పాపానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బలిపశువులుగా మారిపోతారన్న మాట!
స్మిత సభర్వాల్ వంటి పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎంతో తెలివైనవారు, ప్రజలు, ప్రభుత్వం పట్ల నిబద్దత, గలవారు, మంచి సమర్ధులు అని పేరు తెచ్చుకున్నవారే!
ఓ ప్రభుత్వంలో ఇంత గౌరవమర్యాదలు పొందినవారు ప్రభుత్వం మారగానే న్యాయస్థానాల ముందు నిందితులుగా నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ఇది చాలా బాధాకరమే కదా?
వారి దుస్థితి చూస్తున్న యువత ఈ ఐఏఎస్, ఐపీఎస్ చదువులు మనకి అవసరమా? రేయింబవళ్ళు ఎంతో కష్టపడి చదివి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా సమాజంలో ఓ గుర్తింపు సంపాదించుకోవాలనుకుంటే, చివరికి ఈవిదంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ, జైలుకి కూడా వెళ్ళాలని ఎవరూ కోరుకోరు కదా?
కానీ ఇప్పటి రాజకీయాలలో ఎప్పుడూ ఇలాగే జరుగుతుంటే మాకెందుకీ ఐఏఎస్, ఐపీఎస్ చదువులు, ఉద్యోగాలు, అవమానాలు? అని యువత అనుకుంటే దేశం పరిస్థితి ఏమిటి?




