ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్నారు. కనుక సీనియారిటీ ప్రకారం చూస్తే 1988 బ్యాచ్కు చెందిన శ్రీలక్ష్మికి ఈ అవకాశం దక్కాలి. కానీ ఆమె జగన్ బ్యాచ్ కావడంతో పదవీ విరమణ దగ్గర పడుతున్నప్పుడు వచ్చిన ఈ చిట్ట చివరి అవకాశం చేజారిపోయింది.
ప్రస్తుతం ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా చేస్తున్న 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె. విజయానంద్ పేరుని సిఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. నేడో రేపో ఈ మేరకు జీవో జారీ అవుతుంది.
పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేస్తున్న 1990 బ్యాచ్కు చెందిన జీ. అనంత రాము లేదా జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్కి ఈ పదవి ఇవ్వాలని సిఎం చంద్రబాబు నాయుడు అనుకున్నారు. కానీ విజయానంద్ని ఈ పదవికి ఎంపిక చేసుకున్నారు.
సీఎస్ ఎంపికలో సిఎం చంద్రబాబు నాయుడు అందరి కంటే సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన శ్రీలక్ష్మి పేరుని కనీసం పరిశీలనకు కూడా తీసుకోలేదని తెలుస్తోంది.
జగన్ పుణ్యమాని ఆమె జగన్, విజయసాయి రెడ్డిలతో కలిసి జైలుకి వెళ్ళిరాక తప్పలేదు. ఒక ఐఏఎస్ అధికారి జీవితంలో జైలుకి వెళ్ళాల్సి రావడం చాలా బాధకరమైన విషయం కాగా, రాష్ట్ర స్థాయిలో పనిచేసే ప్రతీ ఐఏఎస్ అధికారి ప్రభుత్వం ముఖ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేయాలని కలగంటారు.
కానీ జగన్ సహవాసం పుణ్యామని, ఆమె జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. సీఎస్ పదవి చేజారిపోయింది. జగన్తో సహవాసం చేసినందుకు నేటికీ ఆమె మూల్యం చెల్లించక తప్పడం లేదు. ఆమె కంటే నాలుగేళ్ళు జూనియర్ అయిన విజయానంద్ సీఎస్ కాబోతున్నారు.




