అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలతో భారత్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. కానీ ట్రంప్ బెదిరింపులకు లొంగిపోకుండా గట్టిగా నిలబడాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. కనుక చైనా, రష్యా దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఉక్రెయిన్ పట్ల రష్యా ఎంత కటినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, భారత్-రష్యాల సంబంధాలు బలంగానే ఉన్నాయి. రష్యా నుంచి చమురు, ఆయుధాల కొనుగోలే ఇందుకు నిదర్శనం.
కానీ ట్రంప్ ఆగ్రహానికి ఇదే కారణంగా మారింది. కనుక రష్యాతో భారత్ తెగతెంపులు చేసుకోవాలా? అంటే కాదనే చెప్పాలి.
ఎందుకంటే, ఫలానా ఫలానా దేశాలతో స్నేహం చేయవద్దని ట్రంప్ చెపుతుంటే వాటిని భారత్ మాత్రమే కాదు … ఏ దేశమూ అంగీకరించలేదు కనుక!
భారత్-రష్యాల స్నేహం ఈనాటిది కాదు. సోవియట్ రష్యా కాలం నుంచే ఉంది. పైగా భారత్ వలన రష్యాకి భారీగా బిజినెస్, విదేశీ మారకం లభిస్తోంది. కనుకనే రష్యా కూడా ఈ క్లిష్ట సమయంలో భారత్కు అండగా నిలబడేందుకు ముందుకు వస్తోంది.
కానీ భారత్కు చైనా ఎప్పుడూ పక్కలో బల్లెంలాగే ఉంటోంది. భారత్ భూభాగాలు ఆక్రమించేందుకు చేయని ప్రయత్నాలు లేవు, అలాగే భారత్తో యుద్ధం చేసేందుకు పాకిస్తాన్కి అవసరమైన ఆర్ధిక, ఆయుధ సహాయం అందిస్తూనే ఉంది.
అన్నిటికీ మించి ‘చైనా మాల్’తో భారతీయ పరిశ్రమలను దారుణంగా దెబ్బ తీస్తోంది. ఈ కారణంగా లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. ‘చైనా మాల్’ భారత్ ఆర్ధిక వ్యవస్థకు కూడా సవాలుగా మారిందంటే అతిశయోక్తి కాదు. కనుక ఏవిదంగా చూసినా చైనాని నమ్మలేము.
కానీ ట్రంప్ని బలంగా ఢీ కొనేందుకు భారత్, చైనాతో చేతులు కలిపే బదులు స్వయం సంవృద్ది సాధించి బలంగా నిలబడటమే మంచిది.
కానీ ఇప్పటికిప్పుడు స్వయం సంవృద్ది సాధ్యం కాదు కనుక ట్రంప్ విసురుతున్న ఈ సవాళ్ళను తట్టుకొని నిలబడేందుకు చైనాకి బదులు మన ఆర్ధిక నిపుణులు, పారిశ్రామిక దిగ్గజాలతో చేతులు కలిపి ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలు కనుగొనడం మంచిది.






