భారత్లో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబాయి మధ్య (508 కిమీ) ఏర్పాటవుతున్న సంగతి తెలిసిందే. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకి జపాన్ ఆర్ధిక, సాంకేతిక, నిర్మాణ సహాయసహకారాలు అందిస్తోంది.
దీని కోసం జపాన్ రూ.90,000 కోట్లు రుణం ఇస్తోంది. దీనిని నామ మాత్రపు 0.1 శాతం వార్షిక వడ్డీతో 50 ఏళ్ళలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత అంచనా వ్యయం రూ.1.98 లక్షల కోట్లు. మరో రెండు మూడేళ్ళలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది.
సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ళకు రెట్టింపు వేగంతో అంటే గంటకు 320-350 కిమీ వేగంతో బుల్లెట్ ట్రైన్ ప్రయాణిస్తుంది. కనుక వాటికి గమ్యం చేరుకోవడానికి 7-8 గంటల సమయం పడితే బుల్లెట్ ట్రైన్ కేవలం రెండు గంటల్లోపే గమ్యస్థానం చేరుకోగలదు.
ముంబయి సమీపంలో థానే సమీపంలో సుమారు 7 కిమీ మేర సముద్రం అడుగు నుంచి బుల్లెట్ ట్రైన్ ప్రయాణిస్తుంది. కనుక బుల్లెట్ ట్రైన్లో ప్రయాణమే ఓ గొప్ప అనుభూతి అనుకుంటే దానిలో కూర్చొని సముద్రం కింద నుంచి ప్రయాణించడం మరో గొప్ప అనుభూతినిస్తుంది.
ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో సుమారు 60 శాతం పనులు పూర్తయ్యాయి. ముంబాయి వరకు నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు మరో రెండు, మూడు సంవత్సరాలు పట్టవచ్చు. కనుక అంత వరకు ఎదురు చూడకుండా ముందుగా పూర్తయినంత మేర బులెట్ ట్రైన్ నడిపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ముందుగా గుజరాత్లోని వాపి-సూరత్ మద్య (సుమారు 100 కిమీ) కారిడార్ పనులు కొలిక్కి వస్తున్నాయి. కనుక వచ్చే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన ఈ రెండు నగరాల మద్య బుల్లెట్ ట్రైన్ ప్రారంభం కాబోతోంది.
ప్రారంభోత్సవం కంటే ఆరేడు నెలల ముందు నుంచే ట్రయల్ రన్స్ నిర్వహించాల్సి ఉంటుంది కనుక అప్పుడే జపాన్ నుంచి మొట్ట మొదటి బుల్లెట్ ట్రైన్ భారత్ చేరుకుంది. పైన కాషాయం, మద్యలో నీలం దిగువన తెలుపు రంగులలో చూడముచ్చటగా బుల్లెట్ ట్రైన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




