వరుస విజయాలతో మాంచి ఊపు మీదున్న టీమిండియాను ఆస్ట్రేలియా కంగారెత్తిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో దాదాపుగా రెండవ రోజే ఫలితం తేలిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 260 పరుగులకు ఆలౌట్ కాగా, దానికి సమాధానంగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా చేతులెత్తేసి మ్యాచ్ ను ఆసీస్ పరం చేసేసింది. కనీసం పోరాట పటిమను కూడా ప్రదర్శించలేని పరిస్థితిలోకి ఇండియన్ బ్యాట్స్ మెన్లు వెళ్ళిపోయారంటే, ఏ స్థాయిలో బ్యాటింగ్ చేసారో అర్ధం చేసుకోవచ్చు.
టెస్టుల్లో నెంబర్ 1గా ఉన్నాము, ఇక తమను కొట్టేవారు ఎవరూ లేరని భావించారో ఏమో గానీ, నిర్లక్ష్యపు షాట్లతో మ్యాచ్ ను ఆస్ట్రేలియా వశం చేసారు. స్పిన్ కు అనుకూలించే పిచ్ పై ఉమేష్ యాదవ్ 4 వికెట్లు తీసుకుంటే, అదే పిచ్ పై ఆసీస్ బౌలర్ కెఫే 6 వికెట్లతో సత్తా చాటాడు. ఇంకో విధంగా చెప్పాలంటే కెఫేకు 6 వికెట్లను ఇవ్వడంలో టీమిండియా బ్యాట్స్ మెన్లు సమిష్టి కృషి చేసారు. ఒకానొక దశలో 94 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి, పర్వాలేదనిపించే విధంగా ఉన్న టీమిండియా బ్యాట్స్ మెన్లు చెత్త షాట్లతో ప్రేక్షకులకు విసుగు తెప్పించారు.
అనవసరపు షాట్ కు ప్రయత్నించి రాహుల్ 94 పరుగుల వద్ద 4 వికెట్ గా వెనుదిరగడంతో ప్రారంభమైన పతనం, 105 పరుగుల వద్ద 10వ వికెట్ పడడంతో విజయవంతంగా ముగిసింది. మొత్తమ్మీద 40.1 ఓవర్లను ఎదుర్కొన్న టీమిండియా కేవలం 105 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో ఓపెనర్ కేఎల్ రాహుల్ చేసిన పరుగులు 64 తీసివేస్తే… ఇతర బ్యాట్స్ మెన్ల స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇప్పటికే 155 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్, కనీసం 100 పరుగులు చేసినా, టీమిండియా మళ్ళీ పతనం కావడం ఖాయమనే చెప్పవచ్చు. రెండవ రోజు టీ విరామం ముందే మ్యాచ్ ఫలితాన్ని శాశించడంలో ఇండియన్ బ్యాట్స్ మెన్లు తమ వంతు కృషి చేసారు.



