ఇండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు కీలక మలుపు తీసుకుంది. ఓవర్నైట్ స్కోరు 128/7తో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన న్యూజిలాండ్ ను భారత్ బౌలర్లు త్వరగా పెవిలియన్ పంపడంలో విఫలమయ్యారు. మూడేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ (47) భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని, జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. జీతన్ ను అశ్విన్ వెనక్కి పంపగా, వాట్లింగ్, వాగ్నర్ లను షమీ(3/70) పెవిలియన్కు పంపడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కు తెరపడింది.
ఇక, రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా తడబడింది. తమ పేస్ బౌలింగ్ తో కివీస్ బౌలర్లు టీమిండియా బ్యాట్స్ మెన్లను బెంబేలెత్తించారు. హెన్రీ (3/44), బౌల్ట్(2/28) వీర విజృంభణతో భారత్ ఒక దశలో 43 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. విజయ్(7), పుజారా(4), ధావన్(17), రహానే(1) వెనువెంటనే అవుట్ అవ్వడంతో, కెప్టెన్ కోహ్లీ సమయోచితంగా ఆడాడు. కఠిన పరిస్థితుల్లో కివీస్ బౌలర్లను ఎదురొడ్డి జట్టును ఆదుకున్నాడు. రోహిత్శర్మతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో ఉన్న కోహ్లీ ఎల్బీగా వెనుదిరగడంతో 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత కాసేపటికే అశ్విన్(5) ఔటైనా రోహిత్ మాత్రం బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. సాహాతో కలిసి జట్టును. సాహాతో కలిసి 103 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి, జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు. ఈ దశలో రోహిత్ శర్మ (132 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో) 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. అయితే కష్టకాలంలో టీంను ఆదుకుని, విమర్శకుల నోళ్లు మూయించాడు. రోహిత్ ఇన్నింగ్స్ తో కోల్కతా, ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఈ చారిత్రక 250వ టెస్ట్ మ్యాచ్ దాదాపు భారత్ చేతుల్లోకి వచ్చేసినట్లుగా క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అద్భుతాలు గానీ, వరుణుడు కరుణిస్తే గానీ, ప్రత్యర్ధి జట్టు న్యూజిలాండ్ ఓటమి నుండి తప్పించుకోలేదని డిక్లేర్ చేస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 227 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన టీమిండియా మొత్తం 339 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో వృద్ధిమాన్ సాహా 39, భువనేశ్వర్ 8 పరుగులతో ఆడుతున్నారు. ఈడెన్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన 117 పరుగులకే కావడంతో భారత్ విజయం నల్లేరుమీద నడకేనని క్రికెట్ అభిమానులు కూడా భావిస్తున్నారు.



