పెహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ – పాక్ ల మధ్య మొదలైన ఆపరేషన్ సింధూర యుద్ధ వాతావరణం ఇప్పటికి అలానే కొనసాగుతూ ఉంది. అది ఏ స్థాయికి వెళ్లిందంటే చివరికి ఇరు దేశాల మధ్య జరిగే క్రికెట్ క్రీడ కూడా ఒక యుద్ధమే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి.
ఇరు దేశాల మధ్య ఇటువంటి వేడెక్కిన వాతావరణానికి మరింత వేడిని పెంచేలా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాక్ ఉగ్రవాదాన్ని ఉద్దేశించి ఘాటు హెచ్చరికలే పంపారు. పాకిస్తాన్ ఇక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఇక్కడితో ఆపేయాలని, లేకుంటే పాక్ ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ హెచ్చరించారు భారత్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర.
రాజస్థాన్ లోని అనుపగఢ్ ఆర్మీ క్యాంపు సందర్శనకు వెళ్లిన ఉపేంద్ర ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కాస్త సంయమనం పాటించిందని, కానీ ఒకవేళ ఎటువంటి పరిస్థితులలో అయిన ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభమయితే ఈసారి భారత్ అటువంటి సహనపు కంచెలను కూడా దాటుతుందంటూ చెప్పుకొచ్చారు.
అలాగే ఆపరేషన్ సింధూర్ 2.0 కి భారత ఆర్మీ ఎప్పుడు సన్నద్దంగానే ఉందని, దాని ఫలితాలు కూడా భారత్ కు అనుకూలంగా ఉంటాయంటూ బలంగా ఉద్ఘాటించారు ద్వివేది. అయితే ద్వివేది ప్రకటనలను పరిశీలిస్తే భారత్ పై పాక్ మరోసారి ఉగ్రవాద కుట్రకు ప్రయత్నిస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఈ మధ్యకాలంలో అగ్ర రాజ్య అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై విధిస్తున్న టారిఫ్ లతో, అమెరికాలోని భారత సంతతి పై ఆయన చూపుతున్న వివక్షతో ఎంతో కాలంగా అమెరికా – భారత్ ల మధ్య ఉన్న స్నేహ సంబంధాలు అంచలంచెలుగా చెడిపోతూ వస్తున్నాయి.
ఇదే అదునుగా అమెరికా – పాక్ ల మధ్య స్నేహ బంధం కూడా చిగురులు తొడుగుతుంది. అమెరికా, భారత్ కు వ్యతిరేకంగా పాక్ కు మద్దతు ఇస్తుంది అనే అత్యాశతో భారత్ పై పాక్ కొన్ని కొన్ని సందర్భాలలో తన స్థాయిని మించి ప్రకటనలు చేస్తుంది.
ఈ నేపథ్యంలో పాక్ ను ఉద్దేశించి అక్కడ ప్రభుత్వాలు ఇచ్చే ఉగ్రవాద ప్రోత్సహకాల గురించి భారత్ ఆర్మీ చీఫ్ ఇచ్చిన ప్రకటనలు పాక్ కు గట్టి హెచ్చరికలు పంపినట్టే అవుతుంది. భారత్, పాక్ తో యుద్ధం చేయాలి అని భావిస్తే దాని స్థాయి ఎలా ఉండబోతుందో అనేది ద్వివేది ఇచ్చిన ఈ ఒక్క ప్రకటనలతో పాక్ కు పూర్తి స్పష్టత వచ్చి ఉండాలి.
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మోడీ తీసుకున్న ఆపరేషన్ సింధు జలాల తో పాక్ ఇప్పటికే భారత్ తో కాళ్లబేరానికి వచ్చింది. అలాగే భారత జవాన్ల దాటికి తట్టుకోలేక అమెరికా రాయబారాలతో సంధి చర్చలకు తెరలేపింది. ఇటువంటి సమయంలో భారత్ మరోసారి ఆపరేషన్ సింధూర్ అంటూ పాక్ పై యుద్దాన్ని ప్రకటిస్తే ఇక అది పాక్ కు చావు దెబ్బె అవుతుందేమో బహుశా..!




