ఇనార్బిట్ క్రెడిట్ మీదేనయ్యా… ఎవరూ క్లెయిమ్ చేయలేదుగా?

Inorbit Mall Visakhapatnam grand opening sparks political credit debate between Jagan and Chandrababu Naidu

విశాఖపట్నంలో ‘ఇనార్బిట్‌ మాల్‌’ అట్టహాసంగా ప్రారంభోత్సవం జరిగింది. రూ.6,000 కోట్లు పెట్టుబడితో నగరంలోని కైలాసపురం వద్ద 15 ఎకరాలలో 14 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో దీనిని అద్భుతంగా నిర్మించారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో దీనికి శంకుస్థాపన చేయగా మూడేళ్ళ నిర్మాణ పనులన్నీ పూర్తిచేసుకొని ప్రారంభం అయ్యింది.

దక్షిణాది రాష్ట్రాలలోకెల్లా ఇదే అతిపెద్ద షాపింగ్ మాల్. దీనిలో రెండున్నర ఎకరాలు ఐటి కంపెనీల కోసం కేటాయించడం మరో విశేషం. ఈ ఒక్క షాపింగ్ మాల్ ద్వారానే ప్రత్యక్షంగా సుమారు 3,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా మరో 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ADVERTISEMENT

వైసీపీ సోషల్ మీడియాలో ఇనార్బిట్ మాల్ వీడియో, దానిలో జగన్‌ ఫోటో పెట్టుకుంది. ఖచ్చితంగా ఈ క్రెడిట్ ఆయనదే! కూటమి ప్రభుత్వంలో ఎవరూ క్లెయిమ్ చేయడం లేదు కూడా!

నాడు చంద్రబాబు నాయుడు లూలూ గ్రూప్ (షాపింగ్ మాల్)ని విశాఖకు తీసుకువచ్చి బీచ్ రోడ్డులో స్థలం కేటాయిస్తే, జగన్‌ సిఎం కాగానే అడ్డుకున్నారు. ఆయన రాష్ట్రం నుంచి దానిని తరిమేస్తే తమిళనాడు ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచి పట్టుకుపోయింది.

జగన్‌ దిగిపోయాక సిఎం అయిన చంద్రబాబు నాయుడు కూడా జగన్‌ మీద అసూయతో ‘ఇనార్బిట్ మాల్’ని తరిమేయొచ్చు. లేదా ఆటంకాలు సృష్టించి ఇబ్బంది పెట్టొచ్చు. కానీ అలా చేస్తే ఆయనకీ, జగన్‌కీ తేడా ఉండేది కాదు. తెలిసేది కాదు.

2024 నుంచి నేటి వరకు ‘ఇనార్బిట్ మాల్’ నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు సృష్టించలేదు. అవసరమైతే జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు దానికి సహాయసహకారాలు అందించాలి తప్ప ఎవరూ దాని జోలికి వెళ్ళరాదని సిఎం చంద్రబాబు నాయుడు గట్టిగా హెచ్చరించారు.

అందువల్లే ఇనార్బిట్ మాల్ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్మాణ పనులు చకచకా పూర్తి చేసుకొని ప్రారంభం అయ్యింది.

మరి దీని క్రెడిట్ ఎవరిది? సిఎం చంద్రబాబు నాయుడిదా? స్థలం కేటాయించి శంకుస్థాపన చేసి దిగిపోయిన జగన్మోహన్ రెడ్డిదా?

రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్‌ బ్యాచ్ తెలుగు సినీ పరిశ్రమని చాలా భయపెట్టారు. ఆ దెబ్బకి ఏపీకి వెళ్ళిపోవడం మంచిదనుకుంది. కానీ అదే కేసీఆర్‌ సిఎం కాగానే సినీ పరిశ్రమ బంగారు గుడ్లు పెట్టే ఒక బంగారు బాతు అని గ్రహించి అక్కున చేర్చుకున్నారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అక్కున చేర్చుకున్నారు. సినీ పరిశ్రమ హైదరాబాద్‌ నుంచి చేజారిపోకుండా కాపాడుకుంటున్నారు. ఇంకా ఇంకా అభివృద్ధి చెందేందుకు సాయపడుతున్నారు.

తెలివైన రాజకీయ నాయకులు ఎవరైనా ఇలాగే చేస్తారు. ఇనార్బిట్ మాల్ విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే వ్యవహరించారు. కానీ జగన్‌ వారిని చూసి ఏమీ నేర్చుకోలేదు.

నేటికీ అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలే తన రాజకీయ విధానంగా మార్చుకొని పార్టీని నడిపిస్తున్నారు. కనుక ఫలితాలు, పర్యవసానాలు కూడా అదేవిధంగా ఉంటాయి.

ADVERTISEMENT
Latest Stories