గత ఎన్నికలలో వైసీపి కోసం పనిచేసిన ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ బృందం (ఐప్యాక్) ఈసారి ఎన్నికలకు కూడా పని చేస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగున్నరేళ్ళుగా ఐప్యాక్ బృందం ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ, ప్రభుత్వ పని తీరు, మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేల పని తీరు, ప్రజాధరణ తదితర అంశాల ఆధారంగా సిఎం జగన్మోహన్ రెడ్డికి నివేదికలు సమర్పిస్తూనే ఉంది.
మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వారిని పక్కన పెట్టక తప్పదని హెచ్చరిస్తూనే ఉంది. ఐప్యాక్ నివేదికలను చూపిస్తూ, జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలకు పలుమార్లు క్లాసు పీకి పనితీరు మెరుగు పరుచుకోకపోతే టికెట్ ఇవ్వనని హెచ్చరిస్తూనే ఉన్నారు. చివరికి అంత పనీ చేశారు కూడా!
జగన్ పార్టీలో మార్పులు చేర్పులు చేసుకున్నప్పటికీ జరగకూడని నష్టం జరిగిపోయిందని ఐప్యాక్ తాజా నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో వైఎస్ షర్మిల ప్రవేశించి జగన్మోహన్ రెడ్డిమీద, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడం మొదలుపెట్టిన తర్వాత ఐప్యాక్ తాజాగా మూడోసారి సర్వే చేసి జగన్కు నివేదిక సమర్పించిన్నట్లు తెలుస్తోంది.
లీక్ అయిన ఆ సర్వే ప్రకారం ఈసారి శాసనసభ ఎన్నికలలో టిడిపి, జనసేనలకు 143 సీట్లు, వైసీపికి కేవలం 32 సీట్లు మాత్రమే రావచ్చని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
దీనికి వైసీపి ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుతో పాటు పలు అంశాలు కారణాలుగా చూపిన్నట్లు తెలుస్తోంది.
· టిడిపి, జనసేనలు ఆటుపోట్లను తట్టుకుని నిలబడుతూ పొత్తులు కొనసాగించగలగడం.
· ఆ కారణంగా రాష్ట్రంలో వివిద వర్గాల ప్రజలు వాటివైపు మొగ్గుచూపుతుండటం.
· చంద్రబాబు నాయుడు అరెస్ట్ కారణంగా ప్రజలలో సానుభూతి పెరగడం.
· వైఎస్ షర్మిల ప్రవేశంతో జగన్ ప్రతిష్ట మసక బారుతుండటం. పార్టీపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతుండటం.
ఐప్యాక్ సర్వే చేసి చెప్తున్నవన్నీ నిజాలే అని అందరికీ తెలుసు. ముఖ్యంగా వైసీపి అంటే జగన్, జగన్ అంటే వైసీపి అన్నట్లు సాగుతున్నప్పుడు, వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలతో జగన్ ప్రతిష్ట మసకబారితే వైసీపి ఓటమి అనివార్యమే.
టిడిపి, జనసేనల పొత్తుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలలోనే అభద్రతాభావన్ని సూచిస్తున్నాయి. రాబోయే ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించినందునే, “ఇప్పటికిప్పుడు పదవిలో నుంచి దిగిపోవాలన్నా నేను ‘సిద్దం” అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇటీవలే చెప్పుకున్నారు.
బహుశః ఐప్యాక్ సమర్పించిన 3వ నివేదికను చూసి, ఆ భయంతోనే 5వ జాబితాని పక్కన పెట్టి హడావుడిగా ‘సిద్దం’ సభలు నిర్వహించేందుకు తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వచ్చారేమో?
తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమని కేసీఆర్ గ్రహించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకుని, తమని ఏదో విదంగా ఒడ్డున పడేయమని కోరారు. కానీ సమయం మించిపోయిందని ప్రశాంత్ కిషోర్ చెప్పి వెళ్ళిపోయారు.
ఇప్పుడు జగన్ కూడా ‘సిద్దం’ అంటూ ఎంత హడావుడి చేసినా ప్రయోజనం ఉండబోదని లీక్ అయిన ఐప్యాక్ లెక్కలు చెపుతున్నాయి.




