భారత క్రికెట్ లో అత్యంత ముఖ్యమైన ఈవెంట్ గా ఖ్యాతి గడించింది ఐపీఎల్. 18 ఏళ్లుగా అభిమానులను అలరిస్తూ వచ్చిన ఈ క్రికెట్ జాతర, 19వ సీజన్ ప్రారంభానికై నేడు జట్టు యాజమాన్యాలన్నీ ఆక్షన్ లో పాల్గొననున్నాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ పండుగకు కావాల్సిన సామగ్రి అంతా కొనుగోలు చేసేందుకు నేడు ప్రతి జట్టు యాజమాన్యం సంతకు వచ్చి నచ్చిన ఆటగాడిని బుట్టలోవేసుకుని పట్టుకెళ్లనున్నారు.
అయితే, అత్యంత ఆదరణ కలిగిన ఐపీఎల్ కు ఆక్షన్ అంటే అది ప్రతి ఆటగాడికి ఎంత ముఖ్యమైనదో అర్ధం చేస్కోవచ్చు. అలాగే ప్రతీ ఐపీఎల్ ఆక్షన్ వీక్షించే అభిమానులకు షాక్ ఇస్తూనే ఉంటుంది.
పక్కాగా భారీ ధరకు వెళ్తాడనుకునే ఆటగాడు కనీసం కొనుగోలు కాకుండానే పోయిన సంఘటనలెన్నో..! తక్కువ ధరకే దొరికేస్తాడనుకున్న ఆటగాడు కోట్లు అందుకుని జీవితాలు మలుపు తిరిగిన ఘటనలు మరెన్నో.
అయితే గతంలో కొందరు ఓనర్లు ఈ ఆటగాళ్ల సంతలో కొందరు ఆటగాళ్ల పై కాసుల వర్షం కురిపించగా, అది చివరికి జట్టుకు బెడిసి కొట్టింది. 2021 నుండి చూస్కుంటే ఆక్షన్ లో అత్యధిక ధరకు వెళ్లిన ఏ ఆటగాడు ఆ సీజన్లో అనుకున్న మేరకు రాణించలేదు.
మోరిస్, కిషన్, కరణ్ లు 2021,22,23 లో అత్యధిక ధర పలకగా, 2024 ఆక్షన్ లో మిచెల్ స్టార్క్ కొరకై కోల్కతా యాజమాన్యం ఏకంగా 24.75 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. లీగ్ స్థాయిలో చూస్కుంటే పేలవమైన ప్రదర్శనతో స్టార్క్ ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ, ప్లే-ఆఫ్స్ లో రాణించాడు.
ఇక 2025 ఆక్షన్లో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా రిషబ్ పంత్ కొరకై ఏకంగా 27 కోట్లు రూపాయలను వెచ్చించి తనను జట్టులోకి తీసుకొచ్చాడు. ఇక ఆ ధర పంత్ కు ప్రెషర్ పెంచిందో ఏమో గాని, ఘోరంగా విఫలమయ్యాడు. మరి ఈ ఆక్షన్లో కెమెరాన్ గ్రీన్ 25 కోట్ల రూపాయలతో ఆక్షన్ లో అత్యధిక ధర పలికాడు.
మరొక ఆస్ట్రేలియన్ ప్లేయర్ పై కోల్కతా యాజమాన్యం ఏకంగా 25 కోట్లు పెట్టటంతో అందరూ మరలా స్టార్క్ ను గుర్తుకుతెచ్చుకుంటున్నారు. మరి ఈ సీజన్లోనైనా అత్యధిక ధర పలికిన గ్రీన్ ఈ గండాన్ని దాటగలడా అని చూడాలి..!







