బిహార్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకువచ్చేందుకు ఏపీ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడ తన పోలీసు, హోంగార్డులని అడ్డుపెట్టుకొని అరెస్టు నుంచి తప్పించుకోగలిగారు. కానీ మన న్యాయ వ్యవస్థలో, చట్టాలలో ఎన్ని లోపాలున్నప్పటికీ, నేటికీ అది అత్యంత శక్తివంతమైనదని ఏపీ హైకోర్టు నిరూపించింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ వైసీపీ ఎంపీ, ప్రస్తుత ఏపీ శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణరాజుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టిన కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్పై కేసు నమోదైంది.
అప్పుడు పదోన్నతిపై ఏపీకి వచ్చి సీఐడీ డీజీగా పనిచేసిన సునీల్ నాయక్, ప్రభుత్వం మారేసరికి తన సొంత క్యాడర్ బిహార్కు తిరిగి వెళ్ళిపోయారు.
కనుక ఇక ఏపీ పోలీసులు తనని ఏమీ చేయలేరనుకున్నారు. అరెస్ట్ కాకుండా తప్పించుకొని నిరూపించి చూపారు కూడా.
కానీ ఈ కేసులో అరెస్ట్ అనివార్యమని మాత్రం బాగానే గ్రహించారు. కనుక ముందస్తు బెయిల్ కోసం అమరావతికి వచ్చి హైకోర్టులో పిటిషన్ వేశారు.
తద్వారా తనంతట తానే ఎలుకలా వచ్చి బోనులో చిక్కుకున్నారు. నేటి నుంచి 9వ తేదీ వరకు ప్రతీరోజూ గుంటూరు సీసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
కాదని తిరిగి వెళ్ళిపోతే ఈసారి హైకోర్టు బెయిల్ ఇవ్వదు. పైగా నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినా ఆశ్చర్యం లేదు. కనుక సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం వచ్చి అడ్డంగా దొరికిపోయారు.
హైకోర్టు ఆదేశం మేరకు నేడు గుంటూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు విచారిస్తున్న విజయనగరం ఎస్పీ దామోదర్ ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం సునీల్ నాయక్ని ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసులో సునీల్ నాయక్ ఏ-7గా ఉన్నప్పటికీ, నాడు రఘురామని చిత్రహింసలు పెట్టమని ఎవరు ఆదేశించారో బయటపెడితే వైసీపీకి మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది.




