అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మద్య యుద్ధం మొదలై అప్పుడే 10 రోజులు. త్వరలో ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెపుతున్నప్పటికీ ఇరాన్ దూకుడు చూస్తుంటే ఇప్పట్లో ముగిసేలా లేదు. కనుక ఈ యుద్ధ ప్రాభవం అన్ని దేశాలతో సహా భారత్ మీద కూడా అప్పుడే తీవ్రంగా పడుతోంది. ముందుగా భారత్ చమురు సంస్థలు వంట గ్యాస్ ధర పెంచేశాయి. ఈ కారణంగా గృహావసరాలకు వాడే సిలిండర్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు రెండు బుకింగ్స్ మద్య 21 రోజుల నిబంధన మళ్ళీ ఖచ్చితంగా అమలుచేస్తున్నాయి.
మరోపక్క యుద్ధ భయంతో అందరూ అదనంగా గ్యాస్ సిలిండర్లు నిలువ చేసుకోవడం మొదలుపెట్టడంతో మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడుతోంది. సిలిండర్ ధరలు పెరగడం, లభ్యత తగ్గడంతో అప్పుడే ముంబాయి, బెంగళూరు వంటి కొన్ని నగరాలలో హోటల్స్ మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకమానవు. కనుక అప్పుడే పెట్రోల్ బ్యాంకుల వద్ద పెద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అలాగే బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కూడా. ఇప్పుడు కొన్ని హోటల్స్ మాత్రమే మూతపడి ఉండవచ్చు.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో ప్రత్యక్ష యుద్ధం చేసి గెలవలేమని ఇరాన్కు బాగా తెలుసు. కనుక ఈ చమురు యుద్ధాలకి తెర లేపింది. చమురు ఉత్పత్తి నిలిపివేసి, చమురు సరఫరా అయ్యే హర్మూజ్ జలసంధిలో చమురు నౌకల రాకపోకలు సాగించకుండా కట్టడి చేస్తోంది. అలాగే అమెరికా దళాలకు ఆశ్రయం కల్పిస్తున్న గల్ఫ్ దేశాలపై క్షిపణులు కురిపిస్తూ అవి కూడా పునరాలోచన చేసేలా ఒత్తిడి చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ట్రంప్ ముఖ్య సలహాదారులు ఈ యుద్ధం నిలిపివేయడం మంచిదని నచ్చజెపుతున్నట్లు తెలుస్తోంది. కానీ ట్రంప్ ఎవరి మాట వినే రకం కాదు. ఇక ఇరాక్తో 1980-88వరకు 8 ఏళ్ళు ఏకధాటిగా యుద్ధం చేసిన రికార్డ్ ఇరాన్కి ఉంది. కనుక ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలీదు. కానీ ఇలాగే కొనగుతూ ముడి చమురు, గ్యాస్ సరఫరాలు పూర్తిగా నిలిచిపోతే అనేక కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది.







