వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు జగన్ మోహన్ రెడ్డే అయినప్పటికీ ఆయన రాజకీయ లక్ష్య సాధన కోసం, వైఎస్ఆర్ చివరి కోరిక నెరవేర్చడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారు. ఆ లక్ష్య సాధన దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ప్రత్యర్థి పార్టీలకు చురకలు అంటిస్తున్నారు.
తెలంగాణలో అధికారంలోకి రాదు అనుకున్న కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి రాష్ట్ర కాంగ్రెస్ కు జీవం పోశారు, తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ కు ప్రత్యామ్నాయ నాయకుడు లేడు అనే వాదనను బద్దలుకొట్టుకుంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఎదిగారు.
అయితే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం కాదు దేశంలో కాంగ్రెస్ ను గద్దెనిక్కించాలి అనే భావనతో, తద్వారా రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చెయ్యాలి అనే లక్ష్యంతో అటు ఢిల్లీ నుంచి ఇటు తెలంగాణ గల్లి వరకు రేవంత్ నిరంతరం పరితపిస్తున్నారు.
హ్యాట్రిక్ విజయంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ని గద్దె దింపి హ్యాట్రిక్ ప్రధానిగా దేశ చరిత్రలలో సరికొత్త రికార్డు సృష్టించిన ప్రధాని నరేంద్ర మోడీని ఓడించి భారత ప్రధానిగా రాజీవ్ గాంధీ వారసుడు రాహుల్ గాంధీని గెలిపించాలన్నదే రేవంత్ ముందున్న లక్ష్యంగా కనిపిస్తుంది.
ఇందులో భాగంగానే నేడు ఢిల్లీ కేంద్రంగా సాగిన రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ పోరు లో రాహుల్ ప్రధాని అంశం పై వ్యాఖ్యానించారు. బీసీ లకు మోడీ 42% రిజర్వేషన్ ను అంగీకరించకపోతే మోడీని గద్దెదింపి రాహుల్ కు ప్రధాని పీఠం అప్పగిస్తామంటూ రేవంత్ తన మనసులో మాటను బయటపెట్టారు.
దేశ ప్రధాని పాత్రలో రాహుల్ గాంధీ…ఇదే తెలంగాణ కాంగ్రెస్ ఆకాంక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతిమత లక్ష్యం అన్నట్టుగా ఢిల్లీ సభలో రేవంత్ ప్రసంగం సాగింది. అయితే గతంలో ఇదే ఆశయంతో పనిచేసిన కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఆశయాన్ని సాధించకుండానే లోకం విడిచారు.
ఆ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చెయ్యవలసిన ఆయన తనయుడు వైఎస్ జగన్ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ తో శత్రుత్వం పెట్టుకుని బీజేపీ తో తెరచాటు మిత్రుత్వాన్ని కొనసాగిస్తున్నారు. కొడుకుగా తండ్రి చివరి కోరికను తీర్చాల్సిన జగన్ తన రాజకీయ లబ్ది కోసం వైఎస్ ఆశయాలను గాలికొదిలి ఆయన లక్ష్యాలను నీరుకార్చారు.
దీనితో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన రాజకీయ వారసుడు రేవంత్ రెడ్డేనా.? ఆయనే వైఎస్ఆర్ అంతిమ ఆకాంక్షకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు, ఆయన కోరిక మేరకు రాహుల్ గాంధీని ప్రధాని ని చేసేందుకు బీజేపీ పై రాజకీయ యుద్ధం చేస్తూ కథం తొక్కుతున్నారు.




