గమ్యం దిశగా టిడిపి అడుగులు… సరిగ్గానే పడుతున్నాయా?

is tdp Stepping forward to right destinationఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినవెంటనే రాష్ట్రంలో టిడిపి మళ్ళీ కనబడకుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేసింది. పార్టీలో సీనియర్ నేతల ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తూ, వారిపై అక్రమకేసులు బనాయించి పోలీసులతో వేధింపులకు పాల్పడింది. ఆ వేధింపులు భరించలేక సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత టిడిపి సీనియర్ నేతలు అచ్చన్నాయుడు, అయ్యనపాత్రుడు, ధూళిపాళ నరేంద్ర వంటివారు చాలామంది ఆ వేధింపులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో టిడిపి నేతలు, కార్యకర్తలు ఈ ఒత్తిళ్ళు, వేధింపులు భరించగలరా?టిడిపి వీటిని తట్టుకొని వచ్చే ఎన్నికల వరకు నిలబడగలదా?అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌, మిగిలిన సీనియర్ నేతలు వారికి అండగా నిలబడటంతో వారు ఆ వేధింపులని తట్టుకొని నిలబడగలిగారు. ఇదే పార్టీ మళ్ళీ నిలద్రొక్కుకొని ఇప్పుడు వైసీపీతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి ఎదిగింది.

ADVERTISEMENT

అప్పటి నుంచి టిడిపి పనిచేసే విధానంలో ఓ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు అన్ని జిల్లాలలో టిడిపి చాలా సమన్వయంతో పనిచేస్తోందిపుడు. ఒంగోలులో మహానాడు విజయవంతం అవడానికి అదే ప్రధాన కారణం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమం చేపట్టి, దానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో దానిని కొనసాగించవలసిందిగా ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు తూచా తప్పకుండా తమ అధినేత ఆదేశాన్ని పాటిస్తుండగా, గడప గడపకి వెళ్లాలని, లేకుంటే టికెట్లు ఇవ్వనని సిఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళడం లేదు. బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రజలు సానుకూలంగా స్పందిస్తుండగా గడప గడపకి కార్యక్రమంలో ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను చీదరించుకొంటుండటం విశేషం.

వైసీపీ ప్రభుత్వం పాలన, నిర్ణయాలు, అప్పులు, అరాచకాల వలన ప్రజలలో ఏర్పడుతున్న వ్యతిరేకతను టిడిపి బాగానే అందిపుచ్చుకొని దూసుకువెళుతోంది. అన్నా క్యాంటీన్‌ల నిర్వహిస్తుండటం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇది గుర్తించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు వాటిపై తమ ప్రతాపం చూపినప్పుడు, వారి దౌర్జన్యాలను కూడా హైలైట్ చేసి చూపిస్తోంది.

అయితే ఇప్పటి వరకు జరిగిన, చేసిన యుద్ధాలు ఒక ఎత్తుకాగా ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు చేయాల్సిన యుద్ధం మరో స్థాయిలో ఉంటుందని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, టిడిపి సీనియర్ నేతలకు తెలియంది కాదు. నిజానికి ఇప్పటి నుంచే టిడిపి, వైసీపీల మద్యన పవర్-ప్లే మొదలవుతుందని చెప్పవచ్చు. బహుశః దానిలో భాగంగానే బిజెపితో పొత్తుకు సిద్దపడుతోందేమో?మళ్ళీ బిజెపి, టిడిపి, జనసేనలు కలిస్తే వైసీపీని సులువుగానే ఓడించి అధికారంలోకి రాగలరు. కానీ అంతకంటే ముందు వారి సీట్ల సర్దుబాట్లు, అమరావతి, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై వారిలో వారికి, ప్రజలకు కూడా పూర్తి స్పష్టత అవసరం.

ఒకవేళ టిడిపి, బిజెపిల మద్య పొత్తు లేకపోయినా, సంక్షేమ పధకాల ఎరకు అలవాటు పడిన ఓటర్లను ఏవిదంగా తనవైపు తిప్పుకోవాలనే దానిపై టిడిపి అధిష్టానం ఇప్పటి నుంచే చాలా లోతుగా అధ్యయనం చేసి తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే టిడిపి తన గమ్యం చేరుకోగలదు.

ADVERTISEMENT
Latest Stories