టీడీపీ, వైసీపీ ల మధ్య ఉత్కంఠ రేపుతున్న పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక రేపు జరగనున్న నేపథ్యంలో వైసీపీ కి ఇప్పటి నుంచే ఓటమి భయం వెంటాడుతుందా అన్నట్టుగా వ్యవహరిస్తోంది.
ఇప్పటి వరకు జరిగిన ఐదు జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందులలో అన్ని ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగిపోయాయి. కనీసం ప్రత్యర్థి పార్టీలకు నామినేషన్ వేసే అవకాశం కూడా లేకుండా వైసీపీ తన నియంతృత్వాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
అయితే ఎట్టకేలకు రేపు బ్యాలట్ పేపర్ ద్వారా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలకు టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు సమర శంఖం పూరించి సిద్ధమయ్యాయి. ఈ సమయంలో వైసీపీ ని ఓటమి భయం వెంటాడుతుందా.? పులివెందులలో వైసీపీ ఓడిపోబోతుందా అనే విధంగా వైసీపీ నేతల వ్యాఖ్యలు ఉంటున్నాయి.
ఎన్నికలు స్వచ్ఛాయుత వాతావరణంలో జరగడం లేదు, పోలింగ్ స్టేషన్స్ ను మార్చేస్తున్నారు, ఓటర్లను డబ్బులతో ప్రలోభ పెడుతున్నారు, టీడీపీ నాయకులు వైసీపీ కార్యక్తల మీద దాడులకు తెగబడుతున్నారు, పోలీసులు టీడీపీ పార్టీ క్యాడర్ లా పని చేస్తున్నారు అంటూ వైసీపీ, కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు గుప్పిస్తుంది.
ఇక పార్టీ అధినేత పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్ సైతం పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఉద్దేశ పూర్వంకంగా పోలింగ్ బూత్ ల మార్పుకు సిద్ధపడిందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు.
ఇక నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి కొత్తపల్లి, నల్లపరెడ్డి పల్లి, నల్లగొండువారి పల్లి తదితర గ్రామాలలో టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపణలకు దిగారు.
ఎన్నికలకు కేవలం 24 గంటలు మాత్రమే మిగిలి ఉండగా వైస్ జగన్ హడావుడిగా కోర్ట్ ను ఆశ్రయించడం, అవినాష్ డబ్బులతో ప్రలోభాలకు దిగుతున్నారు అంటూ ఆరోపణలు చేయడం చూస్తుంటే వైసీపీ ఎదో ఒక కారణం తో ఈ పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలను వాయిదా వేయించాలని చూస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
సహజంగా రాజకీయాలలో ఓటమి అంచున నిలబడిన వారిలో ఇటువంటి ఆందోళలన, నిరాశ కనిపిస్తుంది. జగన్ తన చర్యలతో, అవినాష్ తన విమర్శలతో వైసీపీ ఓడిపోబోతుంది అనే సంకేతాలను పార్టీ క్యాడర్ కు ముందుగానే చేరవేస్తున్నారా.?
స్థానిక ఎన్నికల ఓటమికి ఈవీఎం లను నిందిస్తున్న వైసీపీ బ్యాలట్ ఓటింగ్ కోసం పట్టుబడుతోంది. ఇక ఇప్పుడు బ్యాలట్ పద్దతిలో ఓటింగ్ జరిగే ప్రాంతంలో టీడీపీ డబ్బుతో ప్రభావితం చేస్తుంది అంటూ విమర్శిస్తూ వైసీపీ నాయకులు ముందుగానే ఓటమి ని సమర్ధించుకునే ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నారా.?
అంటే వైసీపీ ఓటమికి పార్టీ చర్యలు కానీ, నాయకుల నిర్ణయాలు కానీ కారణం కావు, కేవలం ఈవీఎం లు డబ్బులు మాత్రమే ఎన్నికల గెలుపు ను నిర్దేశిస్తాయని చెప్పదలచుకున్నారా.? ఇక ఈ పులివెందుల పోరులో టీడీపీ నుంచి బిటెక్ రవి సతీమణి లతా రెడ్డి బరిలో దిగగా, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి పోటీలో నిలిచారు.
ఇప్పటికి ఈ ఉపఎన్నికలకు గాను 11 మంది నామినేషన్లు దాఖలు చేయగా, మొత్తం 10,601 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఈ ఎన్నికలకు గాను ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఐదు కేంద్రాలు సమస్యాత్మకమే అంటూ ఎన్నికల సంఘం ప్రకటించింది.






