ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఒకే ప్రయోగంలో ఏకంగా 104 శాటిలైట్లను అంతరిక్షానికి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రయోగం వెనక ఆసక్తికరఅంశాలు…
* నేడు కక్ష్యలోకి ప్రవేశపెట్టబడిన 104 ఉపగ్రహాల్లో 101 విదేశీ, చిన్న ఉపగ్రహాలే.
* పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) వీటిని మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహాల్లో ప్రధాన శాటిలైట్ బరువు 714 కిలోలు కాగా, మిగతా 103 ఉపగ్రహాలూ నానో శాటిలైట్లు. వీటి బరువు 664 కిలోలు.
* నానో శాటిలైట్లు అమెరికా సహా, కజకిస్థాన్, ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ం యూఏఈ దేశాలవి ఉన్నాయి.
* గత జూన్ లో ఇస్రో 20 శాటిలైట్లను ఒకే రాకెట్ ద్వారా ప్రయోగించి విజయం సాధించింది. ఇందులో 13 శాటిలైట్లు అమెరికావే కావడం గమనార్హం.
* హాలీవుడ్ చిత్రం ‘గ్రావిటీ’ నిర్మాణానికి అయిన ఖర్చుతో పోలిస్తే, ఎంతో తక్కువ ఖర్చులో 2014లో నాలుగు విదేశీ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
* ఈ రంగంలో వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్న ఇస్రో, కమర్షియల్ అవకాశాలు అందిపుచ్చుకుంటూ లాభాల బాటన సాగుతోంది. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ రంగంలో ఉన్న కంపెనీలతో పాటు, ఎన్నో దేశాలు టెక్నాలజీ కమ్యూనికేషన్స్ కోసం భారత్ వైపు చూస్తున్నాయి.
* 2013లో మానవ రహిత రాకెట్ ను కేవలం 63 మిలియన్ డాలర్ల ఖర్చుతో మార్స్ మీదకు ఇస్రో ప్రయోగించింది. ఇదే ప్రయోగం అమెరికా చేపడితే అయిన ఖర్చు 671 మిలియన్ డాలర్లు.
* ఇప్పుడిక ఇస్రో లక్ష్యం జూపిటర్, వీనస్ గ్రహాలు. ఈ ప్రయోగం 2012-2022లో జరగనుంది.
* ఇటీవలి బడ్జెట్ లో ఇస్రో కార్యకలాపాల కోసం కేటాయింపులను గత సంవత్సరంతో పోలిస్తే, 23 శాతం పెంచుతున్నట్టు ఆర్థికమంత్రి ప్రకటించారు.
ప్రపంచమే సెల్యూట్ చేసేలా సాధించిన ఈ ఘనత ఇచ్చిన ఉత్సాహంతో మానవసహిత అంతరిక్ష కార్యక్రమాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభించింది. ఇప్పటివరకు అంతరిక్షంలోకి మానవులని పంపిన అనుభవం మన దేశానికి లేదు. భారత వైమానిక దళంతో కలిసి ఇస్రో ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం చేపడుతోంది. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే రష్యా, అమెరికా, చైనాల సరసన భారత్ చేరుతుంది.
అలాగే బ్రహ్మోస్ క్షిపణిని సరిహద్దు వద్ద ఉంచి శత్రుదేశాలు దూకుడును ప్రదర్శిస్తే గట్టి సమాధానం చెబుతామని సంకేతాలు ఇచ్చిన భారత్ మరో ముందడుగు వేస్తోంది. ఈ క్షిపణికి ప్రస్తుతం 300 కిలోమీటర్ల దూరం వెళ్లే సామర్థ్యం ఉంది. అయితే ఆ సామర్థ్య పరిధిని 800 కిలోమీటర్ల దూరం వెళ్లగల వెరైటీని కూడా పరీక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రానున్న మూడేళ్లలో 850 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించేలా చేస్తామని పేర్కొన్నారు.



