ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తే వైసీపీ గెలుపు ఖాయం. అందువల్ల దౌర్జన్యాలకు పాల్పడి ఎన్నికలలో గెలిచే ప్రయత్నం చేస్తుంది. బీసీ రిజర్వేషన్స్ పేరుతో ఎన్నికలు నిర్వహించకపోయినా ఆశ్చర్యం లేదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవ తీర్మానం చేసేశారు.
అంటే ఈ ఎన్నికలు జరగాలని ఆయన కోరుకుంటున్నారా లేదా? అనే సందేహం కలుగుతుంది. జరిగితే ఓటమి ఖాయమని ముందే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈ ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేత లేళ్ళ అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.
రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, అది పూర్తయ్యి తుది ఓటర్ల జాబితా విడుదలయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయరాదని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని లేళ్ళ అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. అలాగే వార్డుల ఓటర్ల జాబితాలు తయారుచేసే ప్రక్రియని కూడా నిలిపివేయాలని కోరారు.
ప్రజలు మన వైపే ఉన్నారని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నప్పుడు, మళ్ళీ ఈవిధంగా హైకోర్టులో పిటిషన్లు వేయించి ఎన్నికలు జరుగకుండా అడ్డుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు? అంటే తమ పార్టీ తీరుని చూస్తున్న ప్రజలు తిరస్కరిస్తారనే భయంతోనే కావచ్చు.
తాజాగా సొంత, అనుకూల మీడియాతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని, రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటూ సర్వే నివేదికలు విడుదల చేసుకొని భుజాలు చరుచుకున్నారు.
కనుక జగన్ అదృష్టం కొద్దీ సరిగ్గా ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. కనుక తమ సర్వేలు నిజమని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు వైసీపీకి ఓ చక్కటి అవకాశంగా కలిసి వస్తున్నాయి.
కనుక ఈ ఎన్నికలలో గెలుపు మనదే అనే నమ్మకంతో, ధైర్యంగా ఉత్సాహంగా పాల్గొనాలి కదా? కానీ హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు?
చివరిగా ఒక మాట. ఈ ఎన్నికలలో ఓడిపోయినా ప్రజలు తప్పుగా అనుకోరు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తేనే సింగిల్ సింహం ఇలా భయపడుతోందేమిటి?అని జనం నవ్వుతారు. ఈ చిన్న ఎన్నికలను ఎదుర్కోవడానికే సింగిల్ సింహం భయపడుతుంటే, రేపు శాసనసభ ఎన్నికలలో కూటమిని ఎలా ఎదుర్కోగలరు?





