2024 ఎన్నికలలో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ కుల రాజకీయాలు మొదలు రాజకీయాలలో ఉండే అస్త్రశస్త్రాలన్నిటిని జనసేన మీద ప్రయోగించింది. పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడించకపోతే తన పేరును రెడ్డి గా మార్చుకుంటా అంటూ కాపు కుల నాయకుడిగా పేరుపొందిన వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పవన్ ఓటమి కోసం సవాల్ విసిరారు.
ఇక పవన్ ఓటమి కోసం వైసీపీ కీలక నేతగా, జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే పెద్దారెడ్డి రామచంద్ర రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి ని పిఠాపురం ఎన్నికల ఇంచార్జ్ గా జగన్ నియమించారు. ఇక వైసీపీ నుంచి వంగా గీత అనే కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ పొలిటికల్ మహిళా లీడర్ ను పవన్ కు ప్రత్యామ్నాయంగా బరిలోకి దింపారు.
ఇలా వైసీపీ పిఠాపురంలో పవన్ ఓటమి కోసం సర్వ శక్తులు ఒడ్డింది. కానీ అదే పిఠాపురం పవన్ ను తమ ఎమ్మెల్యే గా గెలిపించుకోవడమే కాకూండా ప్రభుత్వంలో 5 శాఖల మంత్రి తో పాటుగా, రాష్ట్ర డిప్యూటీ సీఎం పీఠాన్ని సైతం అందించింది. అయితే నాడు పిఠాపురం ప్రజలు పవన్ కు అందించిన ఆ అధికారం, పదవి నేడు పులివెందుల అభివృద్ధికి వినియోగిస్తున్నారు పవన్.
గత కొన్ని దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం కంచు కోటగా ఉన్న జగన్ నియోజకవర్గం పులివెందుల త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ కు పవన్ సుమారు రూ. 280 కోట్లతో పునర్జీవం పోశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ రాకతో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం తప్ప రాజకీయంగా మరో పార్టీకి అవకాశం లభించని పులివెందులలో వైఎస్ కుటుంబం కనీసం ఆ ప్రాంత ప్రజల మంచి అవసరాన్ని కూడా తీర్చలేకపోయిందంటూ జనసేన వైసీపీ పై మండిపడుతుంది. రాజకీయాలకు అతీతంగా, పార్టీల గెలుపోటములను పక్కన పెట్టి జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార కింద సుమారు 280 కోట్ల నిధులను పవన్ పులివెందులకు కేటాయించారు.
దీనితో నాడు పిఠాపురంలో పవన్ ఓటమిని కాంక్షించిన జగన్ కు రిటర్న్ గిఫ్ట్ కింద పవన్, జగన్ నియోజకవర్గమైన పులివెందుల ప్రజల దాహార్తిని తీర్చనున్నారు అంటూ పవన్ అభిమానులు, జనసైనికులు సోషల్ మీడియాలో వైసీపీ ని ట్రోల్ చేస్తున్నారు.




