ఉప ముఖ్యమంత్రి పదవి దేనికి నాలిక గీసుకోవడానికా?

ఈ 5 ఏళ్ళలో ఆంధ్రా అభివృద్ధికి జగన్‌ చేసిందేమీ లేదు కనుక తన ఎన్నికల ప్రసంగాలలో అభివృద్ధికి బదులు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, మూడు పెళ్ళిళ్ళు, ఎల్లో మీడియా, కుట్రల గురించి మాట్లాడుతూ ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నారని అనుకోవచ్చు.

జగన్‌ తన పార్టీని గెలిపించుకోవాలనుకోవడం తప్పు కాదు. కానీ ప్రత్యర్ధులను ఎలాగైనా ఓడించి వారి రాజకీయ జీవితానికి సమాధి కట్టాలని కసితో రగిలిపోతుండటమే తప్పు.

ADVERTISEMENT

ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించగానే జగన్‌ హడావుడిగా ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకుని ఆయనకు ఆ బాధ్యత అప్పగించారు. తమని గాయపరిచి భయబ్రాంతులను చేసేందుకు పిఠాపురంలో బ్లేడ్ బ్యాచ్ దించారని, రూ.100-150 కోట్లు పంచిపెట్టేందుకు సిద్దం చేశారని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ఆరోపించడం గమనిస్తే పవన్‌ని ఓడించాలని జగన్‌ ఎంతగా రగిలిపోతున్నారో అర్దం చేసుకోవచ్చు.

జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చివరి సభను పిఠాపురంలోనే ముగించడం కూడా అందుకే. పిఠాపురంలో కూడా జగన్‌ మళ్ళీ దత్తపుత్రుడు-పెళ్ళాలు మార్చుతారు అంటూ చాలా అవహేళనగా మాట్లాడారు.

“పవన్‌ కళ్యాణ్‌ని గెలిపిస్తే పిఠాపురంలో ఉండడు… హైదరాబాద్‌ వెళ్ళిపోతాడు. అదే వైసీపి అభ్యర్ధి వంగా గీతని గెలిపిస్తే ఆమె ఇక్కడే ఉంటారు. ఆమెకు ఉప ముఖ్యమంత్రిని చేస్తాను,” అంటూ జగన్‌ పిఠాపురం ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించారు.

అయితే జగన్‌ ప్రభుత్వంలో 5 ఏళ్ళుగా ఉప ముఖ్యమంత్రులు, మంత్రులుగా ఉన్నవారు ఏమి వెలగబెట్టారు?వారు ఏనాడైనా తమ తమ శాఖలలో సమీక్షా సమావేశాలు నిర్వహించగలిగారా? జగన్‌ ప్రభుత్వంలో సకల శాఖామంత్రి జగన్మోహన్‌ రెడ్డి… ఆ తర్వాత సజ్జల రామకృష్ణా రెడ్డే కదా? జగన్‌ ప్రభుత్వంలో అందరూ డమ్మీలుగానే మిగిలిపోయినప్పుడు వంగా గీతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఏం ప్రయోజనం?అయినా ఈసారి వైసీపి ఓడిపోతే తన పరిస్థితి ఏమిటో గ్రహించకుండా ఇప్పుడే మంత్రి పదవులు పంపకాల గురించి సొల్లు దేనికి?

ADVERTISEMENT
Latest Stories