ఏపీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, విజయసాయి రెడ్డితో సహా పలువురు నిందితులను ఏపీ సీఐడీ పోలీసులు ప్రశ్నించారు. కేసు నమోదు చేశారు. కొందరు లోపలున్నారు. మరికొందరు బయటున్నారు.
ఈడీ అధికారులు కూడా రంగంలో దిగి మద్యం కుంభకోణంలో దండుకున్న వేలకోట్లు ఏవిదంగా ఎక్కడికి తరలించారో ఆరా తీస్తున్నారు.
దేశంలో జరిగిన అతిపెద్ద మనీ లాండరింగ్ కేసులలో మద్యం కుంభకోణం కూడా ఒకటని ఇప్పటికే స్పష్టమవుతోంది. కనుక ఆక్రమాస్తుల కేసులలో జైలుకి వెళ్ళినట్లే ఈ కేసులో కూడా జైలుకి వెళ్ళక తప్పదని జగన్ కూడా గ్రహించారు. అందుకే ‘అరెస్టుకి సిద్దంగా ఉన్నానని’ చెప్పేశారనుకోవచ్చు.
మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ సన్నిహితులతో మద్యం కుంభకోణంపై చర్చించినప్పుడు, ఈ కేసులో తదుపరి పరిణామాలని వివరిస్తూ జూన్ 10వ తేదీలోగా ఏపీ సీఐడీ పోలీసులు జగన్ని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ కేసు విచారణలో ఆయన సీఐడీ పోలీసులకు సహకరిస్తున్నారు కనుక జగన్ అరెస్ట్ గురించి ఆయనకు ముందస్తు సమాచారం లభించడం సహజమే. కనుక జగన్ అరెస్ట్ గురించి ఆయన చెప్పింది నిజమే అని భావించవచ్చు.
కానీ ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది కనుక ఆయన ఈ విషయాన్ని ధృవీకరించకూడదు కనుక సన్నిహితులతో పంచుకున్నారనుకోవచ్చు.
సౌమ్యుడు, చాలా మంచివాడు, నాకు అత్యంత సన్నిహితుడని జగన్ సర్టిఫై చేసిన విజయసాయి రెడ్డే ఆయన అరెస్టు ముహూర్తం ఖరారు చేయడం విశేషమే కదా?




