40 ఏళ్ళ రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి, హైటెక్ సిటీ, సైబరాబాద్ వంటి నిర్మాణాలు చేసిన ఘనత, అమరావతి లాంటి అద్భుత రాజధాని ఆవిష్కరణ కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా కనిపించినప్పటికీ ఇంకా పారిశ్రామిక వేత్తలకు గత ఐదేళ్ల విధ్వంసమే కళ్ళ ముందు దర్శనమివ్వడం నిజంగా ‘విజనరీ కన్నా విధ్వంసానికే’ బలమెక్కువా.? అన్న ప్రశ్నను తెర మీదకు తెస్తుంది.
ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి గాని, పరిశ్రమలు నెలకొల్పడానికి గాని గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ ఒక్కరు సాహసం చెయ్యలేదు. అలాగే గత ప్రభుత్వ వేధింపులు తాళలేక కొన్ని పరిశ్రమలు ఏపీ నుండి పొరుగు రాష్ట్రాలకు కూడా తరలి పోయిన వైనాలను ప్రత్యక్షంగా చూసిన ఏపీ వాసులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి మీద అమాంతం ఆశలు చిగురించాయి.
అలాగే ఆశలు కూడా కార్యరూపం దాల్చడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు కూడా. ఈ నెల 8 న స్వయానా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సుమారు 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు,పెట్టుబడుల ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. అలాగే గూగుల్, బీపీసీల్, రిలయన్స్ బయో ఎనర్జీ ఇలా అనేక పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.
అయితే వీరందరిది ఒక్కటే ఆందోళన…మరల ఏపీకి వైస్ జగన్ ముఖ్యమంత్రి అయితే.? ఈ ఒక్క ప్రశ్న మొత్తం పారిశ్రామిక వేత్తలను కలవపెడుతుంది. అలాగే ఈ ఒక్క ప్రశ్నఅటు కూటమి ప్రభుత్వ పెద్దలను కూడా పారిశ్రామిక వేత్తలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలోకి నెట్టేస్తుంది. ఇంత రాజకీయ అనుభవం, ఒక విజనరీ లీడర్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు, గౌరవం రెండు ఉండి కూడా ఒక ‘విధ్వంశం’ ముందు బాబు తలవంచక తప్పని పరిస్థితి ఎదురవుతుంది.
దీనితో వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన ఒక శాపంలా వెంటాడుతుంది అంటున్నారు కూటమి పార్టీల మద్దతుదారులు. పారిశ్రామిక వేత్తలే కాదు ఇటు సాధారణ ప్రజలు కూడా ఇదే మాదిరి ఏపీలో పెట్టుబడి పెట్టి రాజధానిలో భూములు కొనాలన్నా కూడా ఇదే సందేహం వారిని వెంటాడి వేధిస్తుంది. గత ఐదేళ్లు ఏపీలో స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం కూటమి రాకతో ఒక్కసారిగా పంజా విప్పింది.
భూముల రేట్లు కూడా గత ప్రభుత్వ హయాంలో పోలిస్తే రెండింతలయ్యాయి. ఇవి అమ్ముకునే వారికి లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ కొనుక్కునే వాడికి మళ్ళీ రేపటి రోజున జగన్ అధికారంలోకి వస్తే అనే భయం అడుగు ముందుకు వేయనియ్యకుండా ఆపుతుంది. ఇలా వైసీపీ, జగన్ అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుగోడల తయారయ్యారు.






