జగన్‌ విదేశీ పర్యటన వార్త సొంత మీడియాలో వేసుకోలేదే!

YS Jagan Mohan Reddy during foreign tour amid court conditions and limited media coverage

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ జిల్లా పర్యటనకు బయలుదేరుతున్నా వారం రోజుల ముందు నుంచి సొంత మీడియా, సొంత సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వార్తలు మొదలవుతాయి.

జగన్‌ పర్యటన రోజున అవి పతాక స్థాయికి చేరుకుంటాయి. ఆయన పర్యటనపై కూటమి నేతలు ఎవరైనా స్పందిస్తే ఓ వారం పది రోజులు లేదా ఒకటి రెండు రోజుల వరకు ఆ విశేషాలు వినిపిస్తాయి.

ADVERTISEMENT

మరి అలాంటప్పుడు జగన్‌ విదేశాలకు వెళుతున్నప్పుడు కూడా సొంత మీడియా, సొంత సోషల్ మీడియాలో ఆ విశేషాలు రావాలి కదా? కానీ రావు.

ఎందుకంటే జగన్‌ విదేశాలకు వెళ్ళాలంటే ముందుగా నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాలి. ఒకవేళ దానికి సీబీఐ లేదా ఈడీ అభ్యంతరం చెపితే వాటితో వాదించి అనుమతి తీసుకోవాలి.

ఐదేళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన జగన్‌ విదేశాలకు వెళ్ళాలంటే, ముందుగా కోర్టు తీసుకుంటున్నారని అందరికీ చెప్పుకోవడం చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ కోర్టు కేసు, విచారణ, షరతులు వగైరాల గురించి సొంత మీడియాలో వ్రాసుకోవడం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.

కనుక జగన్‌ ఎప్పుడు విదేశీ పర్యటనకు బయలుదేరినా ఆ వార్త ముందుగా వైసీపీ సొంత మీడియాలో రాదు. మిగిలిన అన్నిటిలో తప్పక వస్తుంది. ఇప్పుడూ అలాగే వచ్చింది. జగన్‌ దంపతులు ఈ నెల 20 నుంచి మే 15 వరకు రెండు వారాల పాటు యూరప్, యూకేలో పర్యటించబోతున్నారు. లండన్‌లో చదువుకుంటున్న తమ కుమార్తె వద్దకు వెళ్తారు.

జగన్‌ విదేశీ పర్యటనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలి. విదేశాలలో ఉన్నప్పుడు ఉపయోగించే మొబైల్ ఫోన్, ఈ మెయిల్ వివరాలు పోలీసులకు ఇవ్వాలి.

ఏ పని మీద విదేశానికి వెళ్తున్నారో దానికే కట్టుబడి ఉండాలి తప్ప కేసులను ప్రభావితం చేసే ఏ పని చేయకూడదు. చెప్పిన సమయానికి తిరిగి రావాలి. వచ్చిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకి ఆ విషయం తెలియజేయాలని ఆంక్షలు విధించింది.

వారి విదేశీ పర్యటన వార్త సొంత మీడియాలో ఇప్పుడు రాకపోయినా వారు అక్కడ విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి మళ్ళీ వైసీపీ సోషల్ మీడియాలో రన్నింగ్ కామెంట్రీ మొదలైపోతుంది.

అక్కడ జగన్‌ మద్దతుదారులు, అభిమానులు ఆయన కోసం విమానాశ్రయంలో, ఆయా నగరాలలో ఎంతగా ఎదురు చూశారో, ఆయనకు వారు ఏవిధంగా సాదరంగా స్వాగతం పలికారో… ఆ కబుర్లు, ఫోటోలు, వీడియోలు వైసీపీ సోషల్ మీడియాలో మళ్ళీ ప్రత్యక్షమవుతాయి.

కానీ జగన్‌ భారత్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి కోర్టు కథలు ముగిసే వరకు అందరూ రేడియో సైలన్స్ పాటిస్తారు. ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకోగానే మళ్ళీ తాడేపల్లి ప్యాలస్‌ చేరే వరకు రన్నింగ్ కామెంట్రీ మొదలవుతుంది. ఈ పద్ధతి కూడా విచిత్రంగా ఉంది కదా?

ADVERTISEMENT
Latest Stories