బందరు పోర్టుకి… శంకుస్థాపనలు చేయవలె మళ్ళీ మళ్ళీ

Jagan Inauguration Of Bandar Port Construction Worksఏదైనా ఓ నిర్మాణానికి ఒకసారి మాత్రమే శంకుస్థాపన చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం ఒక్కోదానికి మూడేసిసార్లు శంకుస్థాపనలు జరుగుతుంటాయి. ఇన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తున్నా నిర్మాణ పనులు ఎందుకు మొదలుపెట్టలేదు… ఎందుకు జరగడంలేదు? అంటే చిత్రవిచిత్రమైన కారణాలు చెపుతుంటారు. సరే ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు గనుక ఇకనైనా పనులు మొదలు పెడతారా అంటే అదీ అనుమానమే.

ADVERTISEMENT

కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు, విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టుకి సిఎం జగన్మోహన్ రెడ్డి ముచ్చతాగా రెండోసారి శంకుస్థాపనలు చేశారు. నేడు బందరు పోర్టుకి ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేశారు. రూ.5,156 కోట్లు అంచనా వ్యయంతో దీనిని రాబోయే 24-30 నెలల్లో నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వం చెపుతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏపీలో ఆరు పోర్టులు కట్టగా, జగన్‌ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ళలోనే నాలుగు పోర్టులకు శ్రీకారం (శంకుస్థాపన) చుట్టారని, వీటితో ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రమే సమూలంగా మారిపోతుందని వైసీపీ ఆత్మసాక్షి హామీ ఇచ్చింది.

నిజమే… ఓ అభివృద్ధి పని పూర్తయితే ఏ రాష్ట్రం, ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందుతుంది. పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రం, దాని రాజధాని హైదరాబాద్‌ ఇందుకు నిదర్శనంగా మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. కానీ కేవలం శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకొంటే ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని గ్రహించడానికి ‘బందరు పోర్టు’ ప్రత్యక్ష సాక్షి.

దానికి 2008, ఏప్రిల్ 23న వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ పనులు మొదలుపెట్టలేదు. రాష్ట్ర విభజన జరిగి మళ్ళీ ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు దాని కోసం భూసేకరణ చేసి, అనుమతులు సాధించేసరికి పుణ్యకాలం పూర్తయిపోయింది. అయినా దానిని పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు 2019, ఫిభ్రవరి 7న దానికి శంకుస్థాపన చేశారు. కానీ ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే.

వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అయ్యింది. ఇప్పుడు శంకుస్థాపన చేసి రాబోయే 24-30 నెలల్లో పూర్తిచేయగలమని ఆత్మసాక్షి చెపుతోంది కనుక, వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బందరు పోర్టు నిర్మాణపనులు మొదలుపెట్టి ఉండి ఉంటే, ఈ పాటికి అక్కడ పోర్టులో వ్యాపార కార్యకలాపాలు జరుగుతుండేవి. ఆత్మసాక్షి చెపుతున్నట్లు వాటి ద్వారా లక్షల టన్నులు ఎగుమతి, దిగుమతులు జరుగుతుండేవి. వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయంతో పాటు కృష్ణాజిల్లాతో సహా చుట్టుపక్కల జిల్లాలన్నీ మరింత అభివృద్ధి చెంది ఉండేవి. కానీ వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ళు కాలక్షేపం చేసి ఎన్నికలు దగ్గర పడుతుంటే ఇప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి బందరు పోర్టుకి శంకుస్థాపన చేశారు.

వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో తెలీని పరిస్థితి. పైగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. మరి పోర్టు నిర్మాణానికి రూ. 5,156 కోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తుంది? కనుక ఇప్పుడు శంకుస్థాపన చేస్తే పనులు ఎప్పుడు మొదలుపెడుతుంది?

అయినా నాలుగేళ్ళుగా అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలే అన్నట్లు మాట్లాడిన వైసీపీ, హటాత్తుగా ఇప్పుడు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తోందంటే అర్దం ఏమిటి? అని ఆలోచిస్తే ఈ శంకుస్థాపనలు వచ్చే ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టేందుకే అనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories