అవి లోక్ సభ ఎన్నికలు కావచ్చు.. శాసనసభ ఎన్నికలు కావచ్చు లేదా ఇటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు… దేనిలోనైనా విజయమే ప్రామాణికం. వారికే పదవి, అధికారం అన్నీ లభిస్తాయి. కనుక గెలుపు గెలుపే! ఓటమి ఓటమే!
ఎన్నికలలో గెలిచేందుకు అనేక అంశాలు కలిసి రావాలి. అదే విధంగా ప్రతీ ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. గెలుపుకి కారణాలు అందరూ చెప్పుకుంటారు గానీ ఓటమికి నైతిక బాధ్యత తీసుకొని హుందాగా ఒప్పుకునేవారు మన రాజకీయాలలో చాలా తక్కువ మందే ఉంటారు.
రాజకీయాలలో గెలుపోటములు సహజమని ఓటమిని అంగీకరించగలిగిన చంద్రబాబు నాయుడు లాంటివారు ఆ ఓటమికి కారణాలు విశ్లేషించుకొని తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ మళ్ళీ విజయం సాధిస్తుంటారు.
కానీ ఓటమికి బాధ్యత వహించడానికి ఇష్టపడని జగన్, కేసీఆర్, కేటీఆర్ వంటి నేతలు ఇతరులను నిందిస్తూ ‘ఆల్ ఈజ్ వెల్.. మళ్ళీ మనమే’ అంటూ అందరి కళ్ళకు గంతలు కట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. దానికి మళ్ళీ మళ్ళీ ఈవిదంగా మూల్యం చెల్లిస్తూనే ఉంటారు.
తెలంగాణలో తమకు ఎదురేలేదని గర్వంతో విర్రవీగిన కేసీఆర్, శాసనసభ ఎన్నికలలో ఓడిపోగానే వెంటనే మేల్కొని తప్పులు గుర్తించి సరిచేసుకొని ఉండి ఉంటే, లోక్ సభ ఎన్నికలలో కొన్ని సీట్లు అయినా గెలుచుకొని ఉండేవారు. కానీ తన అహంకారం, నిరంకుశత్వం వలననే పార్టీ ఓడిపోయిందని తెలిసి ఉన్నా, కేసీఆర్ ఆ తప్పుని నేటికీ ఒప్పుకోవడం లేదు. సరిదిద్దుకోవడం లేదు. అందుకే లోక్ సభ ఎన్నికలలో ‘మనదే గెలుపు’ అనుకుంటూ మళ్ళీ బోర్లా పడ్డారు.
ఏపీలో వైసీపీ ఓటమికి కూడా జగన్ అహంకారం, నిరంకుశత్వమే ప్రధాన కారణాలు. ఇవి కాక ఇంకా అనేక అవలక్షణాలు, అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయని అందరికీ తెలుసు.
కానీ జగన్ తన వైఫ్యల్యాన్ని నోరు లేని ఈవీఎంలకు అంటగట్టి నైతికంగా మనమే గెలిచామని చెప్పుకుంటూ, మళ్ళీ మనమే’ అంటూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు మళ్ళీ గంతలు కట్టి నడిపిస్తున్నారు. అందువల్లే నేడు పులివెందుల కంచుకోటలో ఈ పరాభవం తప్పలేదు.
అక్కడ కేటీఆర్, ఇక్కడ జగన్ ఇద్దరూ కూడా ఓట్ల శాతాలు లెక్కగట్టుకొని మరొక్క శాతం వచ్చి ఉంటే మేమే గెలిచి ఉండేవాళ్ళమని చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. ఆ శాతాలను పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకునేందుకు ఉపయోగించుకుంటే తప్పకుండా వారి పార్టీలకు మేలు జరిగి ఉండేది.
కానీ వారు తమ అసమర్దతని, వైఫ్యల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆ లెక్కలను ఉపయోగించుకుంటున్నారు. కనుక చరిత్ర ఈవిదంగా పునరావృతం అవుతూనే ఉంటుంది.






