శాసనసభ ఎన్నికలలో వైసీపి దారుణంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేడు తమ ఓటమికి ఈవీఎంలే కారణమన్నట్లు ఓ ట్వీట్ చేశారు. న్యాయం, ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెప్పుకోవడం కాదు కనపడేలా చేయాలని దాని సారాంశం.
అయితే కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు తాము పలికిన మాటలు, చేసిన వాగ్ధానాలు, తిట్టిన్న తిట్లని ఏవిదంగా మరిచిపోయి ఎదుటవాళ్ళని తిడుతుంటారో అదే దూరలవాటు జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది.
కానీ వారు మరిచిపోయినా చరిత్ర పుస్తకాల వంటి మీడియా, సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడారో అన్నీ రికార్డు అవుతూనే ఉంటాయి. ఎన్నేళ్ళైన అవి వాటిలో భద్రంగానే ఉంటాయి.
ఆనాడు 2019 ఎన్నికలలో జగన్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన వీడియో ఇప్పుడు సందర్భోచితంగా పవన్ సంతోష్ అనే నెటిజన్ బయటకు తీసి సోషల్ మీడియాలో మళ్ళీ పెట్టారు.
ఆనాడు జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు వింటున్నప్పుడు నవ్వుకోకుండా ఉండలేము. ఇంతకీ జగన్ ఏమ్మన్నారంటే, “చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పుని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారంటే, తాను గెలిస్తే అన్నీ బాగున్నట్లే ఓడిపోతే మాత్రం ప్రజలు తిరస్కరించారని అంగీకరించకుండా ఈవీఎంలని నిందిస్తున్నారు.
నా లెక్కలు సరిగ్గానే ఉన్నాయి ఈవీఎం బటన్ సరిగ్గా నొక్కలేదంటారు. ఇటువంటి దుష్టుడు, దుర్మార్గుడు, మోసగాడు, రాక్షసుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది,” అని అన్నారు.
ఆనాడు ఆయన చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి ఆ మాటలు అన్నా, అవిప్పుడు అక్షరాల జగన్మోహన్ రెడ్డికే వర్తిస్తున్నట్లు ఉండటం, ఆయన కూడా ఈవీఎంల వలననే తాను ఓడిపోయానని ట్వీట్ చేయడం విశేషం.
అందుకే “టైం ట్రావెల్ చేసి 2024లో తాను మాట్లాడబోయే విషయాన్ని 2019లో ప్రస్తావించి, తనని తానే తిట్టుకుంటున్న మహానుబాబుడు!” అంటూ సదరు నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
ఇప్పుడు జగన్ చెపుతున్న మాటలు, ఆయన గురించి ప్రజలు అనుకుంటున్నవి వింటే ఇది అక్షరాల నిజమే అని అర్దమవుతుంది.




